‘‘ పలుక బంగారు పదాలు- రాయ ముత్యాల సరాలు, పలుకులు పూతరేకులు – పలకరింపు తేనె చిలకరింపు, నుడికారాల వయ్యారాలు- జాతీయాల జాణ తనాలు, నవ నవ లాడే నవ యవ్వన భాష – జవ జీవాలున్న చైతన్య భాష తెలుగు, పన్నెండు కోట్ల నాలుకలపై నాట్య మాడు సంభాషణ చాతుర్య సరస్వతి తెలుగు, తెలుగు భాషా వర్ధిల్లు.!! ’’ తెలుగు భాషపై ప్రేమతో ఓ వ్యక్తి హృదయం నుంచి జాలువారిన అక్షర సత్యం ఇది.
అమ్మా అనే పిలుపుతోనే తెలుగు మాధుర్యాన్ని పంచుతుంది.ఏలికలు మేల్కొని తేనెలొలుకు తేట తెలుగును రక్షించుకోకపోతే కొవ్వొత్తిలా కరిగిపోతోంది.
తెలుగు భాష మృత భాషగా మారుతోంది అన్న మాట వచ్చినప్పటి నుంచి పాఠశాలల్లోనూ తెలుగు భాషను సజీవంగా ఉంచే ప్రయత్నాలు చేస్తున్నారు.మన దేశంలో ప్రాచీన భాషల్లో తెలుగు ఒకటి.కానీ… తెలుగును ప్రాచీన భాషగా గుర్తించడానికి చాలా ఏళ్లు పట్టింది.అయినప్పటికీ తెలుగు వారు భాషను కాపాడుకుంటూ… ప్రపంచమంతా విస్తరించారు.
ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలుగు జాతి గర్వించే నిర్ణయం తీసుకున్నారు.ప్రస్తుతం అక్కడ అధ్యక్ష ఎన్నికలు హోరాహోరీగా జరుగుతున్నాయి.అభ్యర్ధుల గెలుపోటములను నిర్దేశించే భారత సంతతి ప్రజలను ఆకట్టుకునేందుకు డెమొక్రాట్లు, రిపబ్లికన్లు కొత్త కొత్త వ్యూహాలతో ముందుకు వస్తున్నారు.అందివచ్చిన ఏ అవకాశాన్ని వీరు వదులుకోవడం లేదు.
తాజాగా అమెరికాలో పెద్ద సంఖ్యలో వున్న తెలుగువారిని ప్రసన్నం చేసుకోవడానికో, లేక మనవాళ్ల పోరాటమో కానీ తెలుగు భాషను అమెరికాలో కూడా అధికారిక వ్యవహారిక భాషగా గుర్తించింది ఫెడరల్ ప్రభుత్వం.
దీనిలో భాగంగా నవంబర్ 3న జరగనున్న అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి ఓటరు బ్యాలెట్ పేపర్ లో వ్యవహారిక భాషల్లో తెలుగును కూడా చేర్చారు.ఇప్పటికే హిందీ సహా కొన్ని భారతీయ భాషలు ఈ జాబితాలో ఉండగా… ఇప్పుడు తెలుగు కూడా ఆ స్థానాన్ని దక్కించుకుంది.తద్వారా ఎన్నికల ప్రక్రియతో పాటూ… అమెరికాలో జరిగే అన్ని అధికారిక కార్యకలాపాలనూ ఇకపై తెలుగులో కూడా వివరిస్తారు.
ఈ పరిణామం అమెరికాలో ఉన్న తెలుగువారితోపాటూ… ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారికి గర్వకారణమే.