తెలుగులో విష్ణు అనే చిత్రం ద్వారా టాలీవుడ్ సినిమా పరిశ్రమకి హీరోగా పరిచయం అయిన కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు తనయ హీరో మంచు విష్ణు గురించి సినిమా ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు వరుస హిట్ చిత్రాలతో ప్రేక్షకులను బాగానే అలరించిన మంచు విష్ణు రానురాను కథల విషయంలో సరైన నిర్ణయాలు తీసుకోక పోవడంతో ఈ మధ్య కాలంలో పెద్దగా ఆకట్టుకోలేక పోతున్నాడు.
ఈ క్రమంలో ఆ మధ్య తెలుగులో విష్ణు ప్రముఖ సీనియర్ దర్శకుడు దాసరి నారాయణ రావు దర్శత్వంలో నటించిన ఎర్రబస్సు చిత్రం ఫ్లాప్ అయిన సంగతి అందరికీ తెలిసిందే.దీంతో తాజాగా ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూ లో పాల్గొని తనతో ప్రముఖ సీనియర్ స్వర్గీయ దర్శకుడు మరియు నటుడు దాసరి నారాయణ రావుతో ఉన్నటువంటి అనుబంధం గురించి పలు ఆసక్తికర విషయాలను ప్రేక్షకులతో పంచుకున్నాడు.
ఇందులో భాగంగా సీనియర్ దర్శకుడు మరియు నటుడు దాసరి నారాయణ రావు తనకు గాడ్ ఫాదర్ లాంటి వాడని చెప్పుకొచ్చాడు.అంతేకాకుండా తన తండ్రి మోహన్ బాబు కి కూడా సినిమా పరిశ్రమలో ఎంతో సన్నిహితుడని చెప్పుకొచ్చాడు.
అందువల్లనే అప్పట్లో దాసరి నారాయణ రావు తనతో ఓ చిత్రం చేయాలని చెప్పినప్పుడు కథ గురించి ఏ మాత్రం ఆలోచించకుండా కేవలం దాసరి నారాయణ రావు గారి కోసం మాత్రమే ఎర్రబస్సు అనే చిత్రంలో హీరోగా నటించానని చెప్పుకొచ్చాడు.
అయితే ఆ చిత్రం ఫ్లాప్ అయినప్పటికీ తనకు ఏ మాత్రం బాధ లేదని అంతేకాకుండా లెజెండరీ దర్శకుడితో నటించినందుకు తనకు సంతృప్తిగా ఉందని తెలిపాడు.
అంతేకాక సినిమా పరిశ్రమలో దాదాపుగా 150కి పైగా చిత్రానికి దర్శకుడిగా పనిచేసిన గొప్ప దర్శకుడి చిత్రంలో తను కలిసి నటించడం తనకు చాలా గర్వంగా ఉందని చెప్పుకొచ్చాడు.
ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం మంచు విష్ణు తెలుగులో మోసగాళ్లుఅనే చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు ఇటీవల ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పనులు పూర్తవడంతో ఈ నెల 19వ తారీఖున ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సభ్యులు సన్నాహాలు చేస్తున్నారు.కాగా ఈ చిత్రంలో మంచు విష్ణుతో పాటూ కాజల్ అగర్వాల్, జగపతి బాబు, నవదీప్, నవీన్ తదితరులు ప్రధాన తారాగణంగా నటిస్తున్నారు.వాస్తవిక సంఘటన ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
మరి మంచు విష్ణు ఈ అంచనాలను అందుకుంటాడా లేదో చూడాలి.