ఏపీ ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ పరిస్థితి దారుణంగా తయారైంది.అధినేత చంద్రబాబు పార్టీలో నెలకొన్న పరిణామాలు కంట్రోల్ చేయలేక అడకత్తెరలో పోకచెక్కలా ఇబ్బందికర పరిస్థితులన ఎదుర్కొంటున్నారు.
ఇప్పటికే పార్టీ అనేక రకాల ఇబ్బందుల్లో ఉంది.అధికార పార్టీ వైసిపి దూకుడుతో పార్టీలోని నాయకులంతా బెంబేలెత్తిపోతున్నారు.
ఎక్కడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు నిర్వహించేందుకు ఎవరూ సాహసించడం లేదు.ఈ పరిస్థితుల్లోనే ఎంతో మంది పార్టీ నాయకులు టీడీపీని వీడి ఇతర పార్టీలో చేరిపోయారు.
ఉన్న నాయకులతో ఆయన పార్టీని ఏదో రకంగా నెట్టుకు వస్తున్నా, 2024 నాటికి అధికారంలోకి రావాలని అనే తలంపుతో చంద్రబాబు అనేక కార్యక్రమాలు రూపొందిస్తూ, పార్టీ నాయకులు నిత్యం జనాల్లో ఉండే విధంగా ప్లాన్ చేస్తున్నారు.
కానీ గతంలో ఎప్పుడూ లేని విధంగా తెలుగుదేశం పార్టీలో గ్రూపు రాజకీయాలు పెరిగిపోయాయి.
ఎవరికి వారు తామే గొప్ప అని, వేరొకరి నాయకత్వంలో ఎందుకు పని చేయాలి అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.ఈ విషయంలో అధినేత చంద్రబాబు నాయుడు మాటలు సైతం లెక్కచేయని విధంగా నాయకులు వ్యవహరిస్తున్నారు.
ఉత్తరాంధ్ర, రాయలసీమ ,కోస్తా జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది.గతంలో టీడీపీకి తిరుగులేదు అనుకున్న నియోజకవర్గాల్లోనూ పరిస్థితి పూర్తిగా అదుపుతప్పిట్లుగా కనిపిస్తోంది.
రాష్ట్రవ్యాప్తంగా పరిస్థితులు ఎలా ఉన్నా, టీడీపీకి కంచుకోట గా ఉంటూ, చంద్రబాబు సామాజిక వర్గం వారు ఎక్కువగా ఉండే కృష్ణ జిల్లా నాయకుల్లో క్రమ శిక్షణ పూర్తిగా తప్పినట్టు కనిపిస్తోంది.ఇటీవల టిడిపి ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న, విజయవాడ ఎంపీ కేశినేని నాని మధ్య వార్ నడిచింది.
ఒకరిపై ఒకరు వ్యక్తిగత దూషణలకు దిగడంతో పాటు, పార్టీ ఇమేజ్ డ్యామేజ్ కలిగించే విధంగా వ్యవహరించారు.ఎంపీ కేశినేని నాని కుమార్తె కేశినేని శ్వేత ను మేయర్ చేసేందుకు ఆయన ప్రయత్నించడం, దానిని అడ్డుకునేందుకు బుద్ధ వెంకన్న వర్గం ప్రయత్నించడం, దాదాపు 20 చోట్ల టీడీపీ అభ్యర్దులు ఓటమిపాలు కావడానికి కారణం అవ్వడం ఇలా సమస్యలు ఎన్నో ఉన్నాయి.అసలు విజయవాడలో టిడిపి మెజార్టీ కార్పొరేషన్లు దక్కించుకుని, మేయర్ పీఠాన్ని దక్కించుకోవాల్సి ఉన్నా, నాయకుల గ్రూపు తగాదాల కారణంగా ఓటమి చవి చూడల్సి వచ్చిందట.వివాదం మొదలైనప్పుడే టీడీపీ అధినేత చంద్రబాబు ఈ తరహా వ్యవహారాలను కంట్రోల్ చేసి ఉంటే, ఇంత భారీ డ్యామేజ్ కలిగి ఉండేది కాదని , రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి సంఘటనలు ఎన్నో చోటు చేసుకున్న , బాబు వరకు ఆ విషయాలు వెళ్ళినా, ఆయన పెద్దగా స్పందించకపోవడం, వాటిని లైట్ తీసుకోవడం వంటి వ్యవహారాలు కారణంగా టీడీపీ ట్రబుల్స్ ఎదుర్కోవాల్సి వస్తోంది.
బాబు సీరియస్ గా ఈ వ్యవహారాలపై దృష్టి పెట్టకపోతే టీడీపీ మరిన్ని కష్టాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి తలెత్తుతుంది.