కొద్ది రోజుల క్రితం సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్, దాని అనుబంధ సేవలు ఒక్కసారిగా డౌన్ అయిన విషయం తెలిసిందే.అయితే దీనివల్ల ఫేస్బుక్ నష్టపోగా టెలిగ్రామ్ మాత్రం బాగా లాభపడింది.
ఫేస్బుక్ సేవలు గంటల తరబడి స్తంభించిపోవడంతో అదే కాలంలో మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ సూపర్ పాపులర్ అయింది.ఈ సమయంలో బిలియన్లకు పైగా ఆండ్రాయిడ్ యూజర్లు గూగుల్ ప్లే స్టోర్ నుంచి టెలిగ్రామ్ డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకున్నారు.
దీంతో కొద్ది గంటల వ్యవధిలోనే అత్యధిక డౌన్లోడ్స్ సాధించిన మెసేజింగ్ యాప్ గా టెలిగ్రామ్ సరికొత్త రికార్డును సృష్టించింది.
టెలిగ్రామ్ను రష్యాకు చెందిన పావెల్ దురోవ్ 2013లో ప్రారంభించారు.
అయితే ఈ అప్లికేషన్ మంచి సెక్యూరిటీ, అలాగే అనేక ఫీచర్స్ అందిస్తున్నప్పటికీ ఫేస్బుక్, వాట్సాప్ వలె పాపులర్ కాలేకపోయింది.కానీ అక్టోబర్ 4న ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ సేవలు ఒక్కసారిగా ప్రపంచవ్యాప్తంగా నిలిచిపోవడంతో టెలిగ్రామ్కు బాగా కలిసొచ్చింది.
ఈ సమయంలో దాదాపు 70 మిలియన్ల మంది కొత్త యూజర్లు టెలిగ్రామ్ డౌన్లోడ్ చేసుకున్నారు.ఒక్కరోజులో టెలిగ్రామ్ యూజర్ల సంఖ్య వందల కోట్లలో పెరిగిపోయింది.
2021 ఏడాదిలో ఆగస్టు నెలలో టెలిగ్రామ్ ప్రపంచవ్యాప్తంగా ఒక బిలియన్ డౌన్లోడ్ మైలురాయిని చేరుకుందని శాన్ఫ్రాన్సిస్కో సెన్సార్ టవర్ డేటా నివేదిక వెల్లడించింది.బిలియన్ డౌన్లోడ్ మార్క్ దాటిన యాప్స్ జాబితాలో వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, స్నాప్చాట్, స్పాటిఫై, నెట్ఫ్లిక్స్ ఉండేవి.ఇప్పుడు ఆ జాబితాలోకి టెలిగ్రామ్ కూడా చేరింది.టెలిగ్రామ్ ముఖ్యంగా భారత మార్కెట్లో అతిపెద్ద ఇంటర్నెట్ మార్కెట్ సంపాదించినట్లు సెన్సార్ టవర్ తెలిపింది.
టెలిగ్రామ్ సేవలను భారత్, రష్యా, ఇండోనేషియా ప్రజలు బాగా వినియోగించుకుంటున్నారు.2021 ఏడాదిలో 214.7 మిలియన్ యూజర్లు టెలిగ్రామ్ యాప్ ఇన్స్టాల్ చేసుకుంటే వారిలో 47 మిలియన్ల మంది భారత దేశానికి చెందిన వారే కావడం విశేషం.రష్యా నుంచి 21 మిలియన్లు, ఇండోనేషియా నుంచి 17 మిలియన్ల మంది టెలిగ్రామ్ ఇన్స్టాల్ చేసుకున్నారు.దీంతో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒక్క అక్టోబర్ 4వ తేదీనే టెలిగ్రామ్ సంచలన రికార్డులు సృష్టించింది.2020తో పోలిస్తే 61 శాతం వరకు అత్యధికంగా టెలిగ్రామ్ యాప్ డౌన్ లోడ్ చేసుకున్నారని నివేదిక వెల్లడించింది.