తెలంగాణ కాంగ్రెస్ లో పిసిసి అధ్యక్ష పదవి విషయం పెద్ద రచ్చ గానే మారిపోయింది.ఎవరికి ఆ పదవి కట్టబెట్టినా, మిగతా నాయకుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో పాటు, పార్టీకి కోలుకోలేని విధంగా నష్టపోయే పరిస్థితి కనిపిస్తోంది.
తెలంగాణలో పార్టీ పరిస్థితి ఇప్పటికే ఆందోళనకరంగా ఉన్న నేపథ్యంలో, పిసిసి అధ్యక్ష పదవి కోసం సీనియర్ నాయకులు ఎంతగానో పోటీ పడుతూనే వస్తున్నారు.ఈ క్రమంలో పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ, అధిష్టానం ను ఇబ్బంది పెట్టే విధంగా వ్యవహరిస్తూ వస్తున్నారు.
పిసిసి అధ్యక్ష పదవి దక్కకపోతే పెద్ద ఎత్తున పార్టీ సీనియర్ నాయకులు బీజేపీలో చేరేందుకు ఇప్పటికే సర్వం సిద్ధం చేసుకున్నారనే వార్తలు కాంగ్రెస్ అధిష్టానానికి ముచ్చెమటలు పట్టిస్తున్నాయి.ఇది ఇలా ఉండగా, పిసిసి అధ్యక్ష పదవిని ఆశిస్తున్న సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి హైకమాండ్ ను ఉద్దేశించి రాసిన లేఖ సంచలనం సృష్టిస్తోంది.
పార్టీకి కావాల్సింది పులులు సింహాలు కాదని, అందరినీ కలుపుకొని పార్టీకి విధేయులుగా ఉండే నాయకత్వం కావాలంటూ సోనియా, రాహుల్ గాంధీలకు జగ్గారెడ్డి లేఖ రాయడం ఇప్పుడు వైరల్ గా మారింది.ఈ లేఖలో తనకున్న అభ్యంతరాలు, పార్టీ స్థితిగతులు, పార్టీ బలోపేతానికి ఏం చేయాలి అనే విషయాలపైన సమగ్రంగా జగ్గారెడ్డి తన లేఖలో పేర్కొన్నారు.
పార్టీ తెలంగాణలో బలం పెంచుకోవడానికి 25 మందితో కమిటీ వేస్తే బాగుంటుందని జగ్గారెడ్డి చెప్పారు.అలాగే బలమైన నాయకులను ఎంపిక చేసి ఒక్కొక్కరికి ఐదు నియోజకవర్గాలను గెలిపించే బాధ్యత అప్పగించాలని, రైతులు నిరుద్యోగులు, మహిళలు, మైనారిటీ ,ఎస్సీ ఎస్టీల సమస్యలపై పోరాడేందుకు విడివిడిగా కమిటీలు వేయాలని, వారిని సమన్వయం చేసే బాధ్యత పిసికి అప్పగించాలంటూ ఆ లేఖలో కోరారు.
అలాగే నాగార్జునసాగర్ ఉప ఎన్నికల నేపథ్యంలో పిసిసి అధ్యక్షుడి ఎంపిక నిర్ణయం వాయిదా వేయాలని జగ్గారెడ్డి తన లేఖలో కోరారు.తాను ఈ లేఖ రాయడం వెనుక ఎటువంటి స్వార్థం లేదని, నాగార్జునసాగర్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలవాలి అన్నదే బలమైన కోరిక అంటూ జగన్ రెడ్డి చెప్పుకొచ్చారు.తాను పరిమితికి మించి మాట్లాడితే క్షమించాలని జగ్గారెడ్డి కోరారు.మొదటి నుంచి రేవంత్ విషయంలో ఆగ్రహం గా ఉంటూ వస్తున్న జగ్గారెడ్డి త్వరలోనే పిసిసి అధ్యక్ష పదవి రేవంత్ రెడ్డికి రాబోతుంది అని పెద్దఎత్తున ప్రచారం జరుగుతున్న నేపథ్యంలోనే ,అధిష్టానానికి ఈ విధంగా ఘాటు లేఖ రాయడం ప్రాధాన్యం సంతరించుకుంది.