తెలంగాణ రాష్ట్ర మంత్రి వర్గంలోకి మరో ఆరుగురు వచ్చారు.గత ఏడాది సీఎంగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేసిన సమయంలో 12 మందిని తన క్యాబినేట్లోకి తీసుకోవడం జరిగింది.
ఆ సమయంలో కీలకమైన హరీష్ రావు మరియు కేటీఆర్లను మంత్రి వర్గంలోకి తీసుకోక పోవడంతో పాటు లేడీస్ ఎవరికి కూడా ఛాన్స్ ఇవ్వలేదు.మంత్రి వర్గ విస్తరణ కోసం చాలా రోజులుగా తెలంగాణ ప్రజలు అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఎట్టకేలకు నేడు కొత్త గవర్నర్ రాగానే ఆమెతో కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించారు.నిన్నటి నుండి ప్రచారం జరుగుతున్నట్లుగానే ఆ ఆరుగురి పేర్లు అధికారికంగా బయటకు వచ్చాయి.
కొత్త మంత్రులతో తెలంగాణ రాష్ట్ర రెండవ గవర్నర్ తమిళిసై సౌందరాజన్ గారు ప్రమాణ స్వీకారం చేయించారు.మొదటగా హరీష్ రావు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగా, ఆ తర్వాత కేటీఆర్ ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది.
హరీష్ రావు మరియు కేటీఆర్లు ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో జనాల్లో పెద్ద ఎత్తున అరుపులు ఉత్సాహవంతపు కేకలు వినిపించాయి.మూడవ వ్యక్తిగా సబితా ఇంద్రారెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు.
ఈమె కాంగ్రెస్లో గెలిచి టీఆర్ఎస్లోకి వెళ్లిన విషయం తెల్సిందే.నాల్గవ మంత్రిగా గంగుల కమలాకర్ ప్రమాణ స్వీకారం చేశారు.
ఇక అయిదవ మంత్రిగా సత్యవతి రాథోడ్ ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది.చివరగా పువ్వాడ అజయ్ కుమార్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
వీరికి శాఖల కేటాయింపు నేడు రాత్రి లేదా రేపు కాని ఉండే అవకాశం ఉంది.