తెలంగాణ లో తెలుగుదేశం పార్టీ ఏ పరిస్థితుల్లో ఉందో అదే స్థాయికి కాంగ్రెస్ పార్టీ చేరుతుందని అంతా భావిస్తున్న తరుణంలో సరికొత్త రూట్లో రాజకీయం చేసి తిరిగి బలం పుంజుకోవాలని చూస్తోంది.ఒక వైపు అధికార పార్టీ టీఆర్ఎస్, మరోవైపు కేంద్ర అధికార పార్టీ బీజేపీ తెలంగాణాలో రోజు రోజుకి బలం పుంజుకుంటుండడంతో ఏమి చేయాలనో పాలుపోని దుస్థితిలో కాంగ్రెస్ పార్టీ పడిపోయింది.
అసలు కాంగ్రెస్ పార్టీకి ఈ దుస్థితి రావడానికి కారణం సొంత పార్టీ నేతల కుమ్ములాటలు, గ్రూపు రాజకీయాలే కారణం అనే అంచనాకు కాంగ్రెస్ హై కమాండ్ ఉందట.ఈ వ్యవహారాలను ఇలాగే వదిలేస్తే తెలంగాణాలో పార్టీ కనుమరుగయ్యే పరిస్థితి వస్తుందని భావిస్తోంది.
ఈ నేపథ్యంలోనే అధినాయకత్వం నష్ట నివారణ చర్యలకు దిగినట్లు తెలిసింది.తెలంగాణ కాంగ్రెస్ పార్టీ విషయంపై కాంగ్రెస్ హైకమాండ్ ఇన్ ఛార్జి కుంతియా తో చర్చించారు.
కుంతియా కూడా రాష్ట్ర నాయకత్వంపై కొందరు నేతలు తనకు చేసిన ఫిర్యాదులను అధిష్టానానికి తెలియజేశారట.
ఈ గ్రూపు రాజకీయాలకు ఇక్కడితో స్వస్తి పలికించాలంటే నాయకులకు ఒకరితో ఒకరికి సంబంధం లేకుండా పని విభజన చేయాలని కొత్త ప్లాన్ వేసిందట.ఇప్పటి వరకు టి.కాంగ్రెస్ లో ఎవరి గ్రూపు వారిదే అన్నట్టుగా ఉంది.నాయకులు ఎవరి ఇష్టం వచ్చినట్లు వాళ్లు మాట్లాడతారు.ముఖ్యమైన అంశాలపై ఎవరు ఏం మాట్లాడాలో కూడా ఒక ప్లాన్ ఉండడంలేదు.దీని కారణంగానే కాంగ్రెస్ పార్టీ అనేక సార్లు నవ్వుల పాలు అవుతూ వస్తోంది.ఈ నేపథ్యంలో ఏఐసీపీ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ దృష్టికి కుంతియా ఈ సమస్యను తీసుకెళ్లారు.
పీసీసీ ని ప్రక్షాళన చేసినా పెద్దగా ఫలితం ఉండదని, ముందు నాయకుల మధ్య సఖ్యత రావాలంటే వారికి పని విభజన చేయాలని సూచించారట.ఆయన సూచనలు హైకమాండ్ కు కూడా బాగా నచ్చడంతో తెలంగాణ కాంగ్రెస్ నాయకుల మధ్య పని విభజన మొదలయ్యిందట.
దీనిలో భాగంగానే కొందరిని బృందాలుగా విభజించారు.
పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కి నీటిపారుదల అంశాన్ని అప్పగించారు.అలాగే రేవంత్ రెడ్డికి విద్యుత్తు, భూసేకరణ కేటాయింపుల అంశాన్ని కేటాయించారు.ఇక సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డికి చట్టపరమైన అంశాలను అప్పగించారు.
భట్టి విక్రమార్కకు ఆరోగ్యం, విద్య వంటి అంశాలను చూడాలని సూచించారు.ఇలా అంశాల వారీగా పని విభజన చేయడంతో వారు ఆ సబ్జెక్ట్ పై అవగాహన పెంచుకుని, పూర్తి స్థాయిలో కసరత్తు చేసేందుకు సదరు నాయకులకు అవకాశముంటుందని, ఎవరికి వారు రకరకాల మాటలు మాట్లాడకుండా ఎవరకి అప్పగించిన బాధ్యతలను వారు నెరవేస్తూ ఐక్యంగా పార్టీని ముందుకు తీసుకెళ్తారని, అధికార పార్టీ ఆగడాలకు బ్రేకులు వేసి పార్టీ పటిష్టం చేయడం పై దృష్టిపెడతారని కాంగ్రెస్ హై కమాండ్ భావిస్తోంది.
ఇప్పటికే రంగంలోకి దిగిపోయిన ఉత్తమ్ కుమార్ రెడ్డి నీటిపారుదల, రేవంత్ రెడ్డి విద్యుత్తు అంశాలపై అధికార పార్టీపై విమర్శలు చేస్తున్నారు.