తెలంగాణ ప్రభుత్వం వరుసగా కోర్టుల్లో ఎదురుదెబ్బలు తింటూనే వస్తోంది.మొదటి నుంచి కరోనా కు సంబంధించిన వ్యవహారాల్లో తెలంగాణ ప్రభుత్వ తీరును కోర్టులు తప్పు పడుతూ వస్తున్నాయి.
అలాగే కరోనా పరీక్షలు నిర్వహించడం వంటి విషయాల్లో నిర్లక్ష్యం వహించడం పై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చినా టిఆర్ఎస్ ప్రభుత్వ పెద్దలు ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోనట్టుగా వ్యవహరించారు . కరోనా టెస్ట్ లు ఎక్కువ చేస్తే బహుమతులు ఇస్తారా అంటూ వెటకారంగా మాట్లాడారు.తాజాగా ఈ వ్యవహారంలో హైకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేక పిటిషన్లు దాఖలయ్యాయి.వాటిలో ముఖ్యంగా కరోనా టెస్ట్ లు సక్రమంగా చేయకపోవడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఇప్పటికే ఈ పరీక్షలు నిర్వహించడం హైకోర్టు కొన్ని మార్గదర్శకాలను ఇచ్చింది.వాటిలో ముఖ్యమైనది మరణించిన వారికి సంబంధించిన పరీక్షలు తప్పనిసరిగా చేయాలంటూ ఆదేశాలు ఇచ్చింది.
ఆ ఆదేశాలు అమలు కాకపోవడం పై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.ఇది కోర్టు ధిక్కరణ కింద భావించాల్సి ఉంటుందని హెచ్చరించింది.
దీనికి సమాధానంగా ఈ వ్యవహారంపై తాము సుప్రీంకోర్టులో అప్పీల్ చేశామని, ఇంకా వాదనలు మొదలవలేదు అని అడ్వకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు.అక్కడ విచారణ మొదలయ్యే వరకు అయినా తమ ఆదేశాలను అమలు చేయాలని కోర్టు చెప్పింది.
ప్రజల ఆరోగ్యం విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం మంచిది కాదని, తమ ఆదేశాలు అమలు కాకపోతే వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి, ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ ను దీనికి బాధ్యులను చేస్తామని కోర్టు తెలిపింది.
తరువాత జరిగే విచారణకు వీరిద్దరు వ్యక్తిగతంగా హాజరు కావాలంటూ పేర్కొంది.ప్రజలకు సక్రమంగా కరోనా టెస్ట్ లు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది.కరోనా టెస్ట్ లు తగినంత సరఫరా చేయనందుకే వైద్యులకు కరోనా సోకిందని హైకోర్టు అభిప్రాయపడింది.
మీడియా బులిటెన్ లలో కరోనా కు సంబంధించి తప్పుడు లెక్కలు ఇస్తే ఇకపై కోర్టు ధిక్కరణ చర్యలు తప్పవని హెచ్చరించింది.కరోనా కు సంబంధించి వాస్తవాలు ప్రజలకు తెలియకపోతే ఎలా అని కోర్టు అభిప్రాయ పడింది.
ఈ నెల 17లోగా అఫిడవిట్ దాఖలు చేయాలని వైద్య ఆరోగ్య శాఖకు కోర్టు సూచించింది.