తెలంగాణా రాష్ట్రంలో కరోనా విలయతాండవం చేస్తున్న సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో జీహెచ్ ఎంసీ పరిధిలో పూర్తి లాక్ డౌన్ చేసేందుకు అక్కడి ప్రభుత్వం యోచనలో కూడా ఉంది.
అయితే ఒకపక్క రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై తర్జనభర్జన పడుతున్న సమయంలో ఆ రాష్ట్ర హోంమంత్రి కి కరోనా పాజిటివ్ నిర్ధారణ అవ్వడం గమనార్హం.వరుసగా పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో ఎలాంటి ప్రణాళికలు రూపొందించాలా అని ప్రభుత్వం కసరత్తులు చేస్తున్న సమయంలో హోంమంత్రి మహమూద్ అలీ కి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది.
దీనితో ఆయనను అపోలో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు సమాచారం.గత బుధవారమే ఆయన దగ్గర పనిచేస్తున్న ఐదుగురు గన్ మెన్ల కు కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ అని తేలిన విషయం విదితమే.
దీనితో మూడు రోజుల క్రితం మంత్రిగారికి కూడా టెస్ట్ లు నిర్వహించగా తాజాగా వెల్లడైన నివేదిక లో ఆయన కరోనా పాజిటివ్ ఉన్నట్లు తేలింది.దీనికి తోడు ఆయనకు ఆస్తమా కూడా ఉండడం తో ముందుగానే కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్పించినట్లు తెలుస్తుంది.
ఆదివారం సాయంత్రం హాస్పిటల్లో చేరినట్లు అధికారులు చెబుతున్నారు.
మరోవైపు పోలీసులు అప్రమత్తం అయ్యారు.
హోంమంత్రితో తిరిగిన వారిని క్వారంటైన్కు పంపిస్తున్నారు.అలాగే హోంమంత్రి నివాసం ఉండే పరిసర ప్రాంతాల్లో మున్సిపల్ సిబ్బంది శానిటైజర్ చేస్తున్నారు.
హోంమంత్రి ఆరోగ్యంపై సహచర మంత్రులు వాకబు చేస్తున్నారు.కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు.
మొత్తానికి మంత్రిగారికి కూడా కరోనా సోకడం కలకలం రేపింది.