దేశ వ్యాప్తంగా పెరిగిపోతున్న కాలుష్య నియంత్రణ కోసం ఒక్కో రాష్ట్రం ఒక్కో విధంగా నిబంధనలను విదిస్తుంది.ఈ కాలుష్య ప్రభావం వల్ల ఢిల్లీ లో చోటుచేసుకుంటున్న పరిస్థితుల నేపథ్యంలో కొన్ని రాష్ట్రాలు అప్రమత్తమై ముందుగానే చర్యలకు దిగుతున్నాయి.
ఈ క్రమంలో తాజాగా తెలంగాణా రాష్ట్రం హైదరాబాద్ లో కూడా పెరుగుతున్న కాలుష్యం నియంత్రించడానికి సర్కార్ నడుం బిగించింది.ఈ నేపథ్యంలో కాలుష్య నియంత్రణ కు తగిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలి అంటూ రవాణాశాఖ ను కూడా ఆదేశించినట్లు తెలుస్తుంది.
ఈ క్రమంలోనే నగరంలో డీజిల్ వాహనాలను నియంత్రించాలన్న ఉద్దేశ్యం తో 12 ఏళ్లు దాటిన డీజిల్ వాహనాలపై నిషేధం విధించాలని సర్కార్ నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.నగరంలో ప్రస్తుతం 15 లక్షల డీజిల్ వాహనాలు తిరుగుతున్నాయి.
వీటి నుంచి పెద్ద ఎత్తున కార్బన్ ఉద్గారాలు విడుదలవుతున్నాయన్న ఉద్దేశ్యం తో ఈ మేరకు నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తుంది.మరోపక్క డీజిల్ ఆధారిత వాహనాల సంఖ్య మరింత పెరగకుండా కూడా చూడాలని టీసర్కార్ భావిస్తోంది.
పెట్రోలు వాహనాలతో పోలిస్తే డీజిల్ వాహనాలపై ప్రస్తుతం రెండు శాతం పన్ను అదనంగా వసూలు చేస్తున్న సంగతి తెలిసిందే.అయితే దీనిని మరింత పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది.
దానికి బదులుగా ఎలక్ట్రిక్ వాహనాలకు పన్ను మినహాయింపు ఇవ్వడం వల్ల ఎలక్ట్రిక్ వాహనాలపై ఆకర్షితులు అవుతారు అని ప్రభుత్వం భావిస్తుంది.ఇందుకు సంబంధించిన ప్రతిపాదనల తయారీలో రవాణా శాఖ అధికారులు తలమునకలై ఉన్నట్టు తెలుస్తోంది.