ఈ మధ్య కాలంలో తెలంగాణ సీఎం కేసీఆర్ తీసుకుంటున్న నిర్ణయాలు వివాదాస్పదం అవుతుండడమే కాకుండా అనవససర గందరగోళానికి కారణం అవుతూ వివాదాలు రేపుతున్నాయి.ఈ మధ్యకాలంలో తెలంగాణ ప్రభుత్వం గ్రామ పంచాయతీలను బలోపేతం చేయాలనే ఉద్దేశంతో కొత్త చట్టాన్ని తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తోంది.
అయితే దీనిపై చాలా అసంతృప్తే చెలరేగుతోంది.ఇప్పటికే ఈ కొత్త పంచాయతీ రాజ్ విధానాన్ని వ్యతిరేకిస్తూ చాలామంది సర్పంచులు అసంతృప్తిగా రోడ్ల మీదకి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పుతున్నారు.
అదీకాకుండా ఈ కొత్త చట్టం ద్వారా ఉప సర్పంచ్ కి కూడా చెక్ పవర్ ఇవ్వడంతో చాలా గ్రామాల్లో వివాదాలు చెలరేగుతున్నాయి.దీని కారణంగా పనులు ముందుకు సాగడం లేదనీ, అనవసర గొడవలు పెరిగి తలనొప్పులు వస్తున్నాయని సర్పంచుల సంఘం ఎంత ఆందోళన వ్యక్తం చేస్తున్నా తెలంగాణా సీఎం కేసీఆర్ ఆ విషయాలను పరిగణలోకి తీసుకోవడంలేదట.
పైగా సర్పంచులు తనను బ్లాక్ మెయిల్ చేయాలనుకుంటే ఊరుకోనని, మరిన్ని కఠిన నిబంధనలు విదిస్తానని కేసీఆర్ హెచ్చరికలు చేస్తున్నాడు.
అయితే ఈ విషయాన్ని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు టీఆర్ఎస్ వ్యతిరేక పార్టీలు ఎదురుచూస్తున్నాయి.ప్రస్తుతం సర్పంచులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న చెక్ పవర్ తోపాటు, కొత్త విధానంపై పెద్ద ఎత్తున నిరసన తెలిపేందుకు ప్రతిపక్షాలన్నీ కలిసి త్వరలోనే ఆందోళన కార్యక్రమానికి శ్రీకారం చుట్టేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు.అయితే కొత్త పంచాయతీ రాజ్ చట్టం విషయంలో కొంతమంది కలెక్టర్ల తీరు సర్పంచులకు మరింత ఆగ్రహం తెప్పిస్తోంది.
కేవలం ముప్పై రోజుల్లోనే గ్రామాల స్వరూపాలు మారిపోవాలంటూ కొత్త యాక్షన్ ప్లాన్ ను సీఎం కేసీఆర్ ఈ మధ్య ప్రకటించారు.దీని అమల్లో భాగంగా కలెక్టర్లు పంచాయతీల సందర్శనకు వెళ్తున్నారు.
అయితే, కొత్త చట్టం ప్రకారం సర్పంచుల పనితీరు బాగులేదని అనిపించినా, ఏమాత్రం నచ్చకపోయినా వెంటనే ఆ సర్పంచ్ ని డిస్మిస్ చేసే అధికారం కలెక్టర్లకు ఉంది.దీనిని ఆసరాగా చేసుకుని కలెక్టర్లు సర్పంచులపై పెత్తనం చేస్తున్నారని సర్పంచుల సంఘం ఆరోపిస్తోంది.
అదీకాకుండా సర్పంచుల పాలన, పనితీరుపై గ్రేడింగ్ విధానం ద్వారా మార్కులు కలెక్టర్లు వేస్తారని కేసీఆర్ ప్రకటించడం విమర్శలపాలవుతోంది.ఈ 20 రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా 90 మంది సర్పంచులకు ఆయా జిల్లాల కలెక్టర్లు షోకాజ్ నోటీసులు జారీ చేశారు.200 మంది గ్రామ సెక్రటరీలకు, ఇతర అధికారులకు మెమోలు అందాయి.పంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు నిధులే విడుదల చేయకపోగా, కలెక్టర్ లు తమపై విమర్శలు చేస్తున్నారని, పనులు సక్రమంగా ముందుకు సాగడం లేదంటూ ప్రశ్నిస్తున్నారని రాష్ట్ర సర్పంచుల సంఘం ఆరోపిస్తోంది.
ఇక కొత్త పంచాయతీ రాజ్ చట్టం ద్వారా కేసీఆర్ అనవసర వివాదాల్లో చిక్కుకున్నట్టు కనిపించడంతో పాటు ప్రతిపక్షాలకు తామే ఆయుధాలు ఇచ్చినట్టు కనిపిస్తోంది.