తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెరుగుతున్న కరోనా కేసులను దృష్టిలో ఉంచుకుని కీలక నిర్ణయం తీసుకుంది.రాష్ట్రంలోని విద్యార్థులకు ఈ నెల 8వ తేదీ నుంచి 16వ తేదీ వరకు సంక్రాంతి సెలవులు కాగా ఈ సెలవులను 30వ తేదీ వరకు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి అయిన సోమేశ్ కుమార్ నుంచి ఈ మేరకు ఉత్తర్వ్యులు వెలువడ్డాయి.నిన్నటినుంచి రాష్ట్రంలో సెలవుల పొడిగింపు గురించి ప్రచారం జరుగుతోంది.
ఆ ప్రచారాన్ని నిజం చేస్తూ ప్రభుత్వం నుంచి ఉత్తర్వ్యులు వెలువడటం గమనార్హం. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ సూచనల మేరకు తెలంగాణ సర్కార్ ఈ నిర్ణయాన్ని తీసుకుంది.
రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.కరోనా కేసులు భారీగా నమోదవుతున్న సమయంలో విద్యార్థుల ఆరోగ్యంను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ప్రజలు ప్రశంసిస్తున్నారు.
దేశంలో ఇతర రాష్ట్రాల్లో డిసెంబర్ చివరి వారం నుంచి కరోనా కేసులు పెరుగుతుండగా తెలుగు రాష్ట్రాల్లో గత వారం రోజుల నుంచి కరోనా కేసులు పెరుగుతున్నాయి.అయితే ఏపీతో పోల్చి చూస్తే తెలంగాణలో తక్కువగానే కరోనా కేసులు నమోదవుతున్నాయి.
కరోనా పిల్లలపై ప్రభావం చూపే ఛాన్స్ ఉండటంతో ముందస్తు చర్యల్లో భాగంగా ప్రభుత్వం సెలవులను పొడిగించింది.
ఈ నెలాఖరు నాటికి రాష్ట్రంలో పరిస్థితులను బట్టి ప్రభుత్వం స్కూళ్లను తెరిచే విషయంలో నిర్ణయం తీసుకోనుంది.కరోనా, లాక్ డౌన్ నిబంధనల వల్ల విద్యార్థుల కేరీర్ కు ఊహించని స్థాయిలో నష్టం జరుగుతోంది.థర్డ్ వేవ్ తర్వాత కరోనా వైరస్ పూర్తిగా అంతమవుతుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.
ఫిబ్రవరి చివరి వారం వరకు కరోనా కేసులు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తుండటం గమనార్హం.