తెలంగాణలో రెవెన్యూ సిబ్బంది ఇప్పటికీ భయం భయంగానే విధులు నిర్వహిస్తున్నారు.ఎప్పుడు ఎవరు తమ మీద ఎటువంటి దాడి చేస్తారో తెలియక బిక్కుబిక్కుమంటూ విధులు నిర్వహిస్తున్నారు.
ఇటీవల అబ్దుల్లాపూర్మెట్ తహసిల్దార్ విజయ రెడ్డి మీద ఓ రైతు పెట్రోల్ దాడి చేయడం, ఆమె అక్కడికక్కడే దుర్మరణం చెందడం రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపింది.ఇక అప్పటి నుంచి తమ ఆఫీసు పరిసరాల్లో ఎవరు అనుమానస్పదంగా కనిపించినా ఆందోళనకు గురవుతున్నారు.
ఇటీవల ఏపీలో మహిళా ఎమ్మార్వో ఒకరు తన కార్యాలయంలో ఎవరూ రాకుండా ఓ తాడు అడ్డంగా కట్టి రక్షణ ఏర్పాట్లు చేసుకోవడం మీడియాలో వైరల్ న్యూస్ గా మారింది.
ఆ తరువాత రాజన్న సిరిసిల్ల జిల్లాలో రైతు పెట్రోల్ బాటిల్ తో ఎమ్మార్వో కార్యాలయానికి రావడంతో అక్కడి రెవెన్యూ సిబ్బంది హడలెత్తిపోయారు.
అయితే అతన్ని ఆరాతీయగా అసలు విషయం తెలిసి ఊపిరి పీల్చుకున్నారు.ఇక ప్రభుత్వం కూడా బాటిళ్లలో పెట్రోల్ నింపడం పై నిషేధం కూడా విధించింది.
తాజాగా జగిత్యాల జిల్లాలోని ఓ ఎమ్మార్వో కిటికీ నుంచి దరఖాస్తులు తీసుకుంటూ మీడియా కెమెరాలు చిక్కాడు.జిల్లాలోని ఇబ్రహీంపట్నం తాసిల్దార్ కార్యాలయంలో దరఖాస్తులు ఇచ్చేందుకు అర్జీదారులు ఇచ్చే పత్రాలను కిటికీలోంచి తీసుకుంటున్నారు.
ఒకవేళ లోపలికి రావడం అత్యవసరం అయితే వారిని రెవిన్యూ సిబ్బంది క్షుణ్ణంగా తనిఖీలు చేసి లోపలికి పంపిస్తున్నారు.మరికొంతమంది ఎమ్మార్వోలు పోలీసుల రక్షణ తీసుకుంటూ విధులు నిర్వర్తిస్తున్నారు.
మొత్తానికి పెట్రోల్ బాటిల్ రెవెన్యూ సిబ్బందిని బాగా భయపెట్టింది.ఈ ఘటనలపై రెవెన్యూ సిబ్బంది ప్రజల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కుంటున్నారు.