తెలంగాణలో ఇప్పుడు వైఎస్ షర్మిల పేరు మారుమోగుతోంది.ఆమె పార్టీ ఏర్పాట్ల వ్యవహారంపై బిజీబిజీగా గడుపుతున్నారు.
జిల్లాల వారీగా మండలాల వారీగా కమిటీలను నియమించి , పార్టీని జనాల్లోకి తీసుకువెళ్లాలనే విషయమై విస్తృతంగా చర్చిస్తున్నారు.ఇప్పటికే వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఆయనకు అత్యంత సన్నిహితులుగా ముద్రపడిన రిటైర్డ్ ఐఏఎస్ లు కొంతమంది ఇప్పటికే షర్మిలకు సలహాదారులుగా చేరిపోయారు.
పూర్తిస్థాయిలో అన్ని వ్యవహారాలు ఒక కొలిక్కి వచ్చిన తర్వాత పార్టీ పేరును ప్రకటించి, పాదయాత్ర ద్వారా జనాల్లోకి తీసుకెళ్లాలనే ఆలోచనతో ముందుకు వెళ్తున్నారు.ఇదిలా ఉంటే షర్మిల కొత్త పార్టీ ఏర్పాటుపై అప్పుడే విమర్శలు పెద్ద ఎత్తున మొదలయ్యాయి.
టిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్ ఇలా అన్ని పార్టీల నేతలు షర్మిల పై విమర్శలు చేస్తూ వస్తున్నారు.
ఇప్పుడు షర్మిల పార్టీ పెడితే ఏ సామాజిక వర్గాలు ఆమెకు దగ్గరవుతాయి ? ఎవరెవరు పార్టీలో చేరబోతున్నారనే చర్చ ఇప్పుడు జరుగుతోంది.ముఖ్యంగా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతలు ఎక్కువగా పార్టీలో చేరేందుకు ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.అలాగే తెలంగాణలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి అభిమానులు పెద్ద ఎత్తున ఉండడంతో, వారు ఇప్పుడు షర్మిల పార్టీలో చేరాలని చూస్తున్నారట.
ముఖ్యంగా టిఆర్ఎస్ లో ఉంటూ రాజకీయంగా ప్రాధాన్యం లేని నాయకులతో పాటు, కాంగ్రెస్ కు చెందిన కీలక నాయకులు తెరవెనుక షర్మిల తో చర్చలు జరుపుతున్నారట.కాంగ్రెస్ కు చెందిన కోమటిరెడ్డి బ్రదర్స్ వెంకటరెడ్డి , రాజగోపాల్ రెడ్డి ఈ ఇద్దరూ కాంగ్రెస్ వ్యవహారం పై అసంతృప్తితోనే ఉన్నారు.
అలాగే ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సైతం షర్మిల వెంట నడిచేందుకు సిద్ధమవుతున్నారట.ఇలా అన్ని పార్టీలకు చెందిన చాలా మంది నేతలు తమ రాజకీయ ఉనికిని చాటుకునేందుకు పార్టీలో కీలకంగా వ్యవహరించాలని చూస్తున్నారట.రానున్న రోజుల్లో తమకు తిరుగులేకుండా చేసుకునేందుకు ఇప్పటి నుంచే అన్ని రకాలుగా ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.అలాగే త్వరలోనే పాదయాత్ర చేసేందుకు సిద్ధమవుతున్న షర్మిల కు ఆ సమయంలో ప్రజల నుంచి వచ్చిన స్పందన చూసి.
ఆమె పార్టీ ప్రకటించిన తర్వాత తలెత్తే రాజకీయ పరిణామాలు అన్నీ అంచనా వేసుకుని తరువాత షర్మిల పార్టీలో చేరాలనే ఉద్దేశంతో చాలామంది నాయకులు ఉన్నారట. ఏదిఏమైనా షర్మిలకు తమ పార్టీ పేరు ఇంకా ప్రకటించకుండానే తెలంగాణ రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నట్టు గా కనిపిస్తున్నారు.