మాజీ మంత్రి ఈటెల రాజేందర్ టిఆర్ఎస్ పార్టీ మధ్య రాజకీయం వెడెక్కినట్టు కనిపిస్తోంది.ఆయనను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయడంతో వెంటనే ఆయన తన ఎమ్మెల్యే పదవికి, పార్టీకి రాజీనామా చేస్తారని అంతా భావించారు.
అలాగే కొత్త పార్టీ ఏర్పాటు పైన, ఇతర పార్టీలోకి వెళ్లే విషయం పైన ఎన్నో ఊహాగానాలు వచ్చినా, ప్రస్తుత పరిస్థితుల్లో వేగంగా నిర్ణయం తీసుకుంటే ఇబ్బందులు ఎదురవుతాయి అనే ఆలోచనతో రాజేందర్ ఉన్నారు.అందుకే తెలంగాణ అంతటా ఆయన పర్యటిస్తూ కీలకమైన నాయకులందరినీ కలుస్తూ రాజకీయంగా ఏ విధంగా ముందుకు వెళితే బాగుంటుంది అనే విషయంపై చర్చలు జరుపుతున్నారు.
అయితే రాజేందర్ కదలికలపై పూర్తిగా దృష్టి పెట్టిన టిఆర్ఎస్ ముందుగా ఆయన సొంత నియోజకవర్గమైన హుజూరాబాద్ లో ఆయనను ఒంటరి చేయాలని అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తోంది. మంత్రి గంగుల కమలాకర్ ఈ విషయంపై పూర్తి దృష్టి పెట్టారు.
రాజేందర్ కీలక అనుచరులు అందరితోనూ మంతనాలు చేస్తూ, పార్టీలోనే ఉండే విధంగా , అలాగే వారికి ప్రాధాన్యం పెంచే విధంగా కమలాకర్ వారితో మంతనాలు చేస్తున్నారు .దీనిని తిప్పికొట్టేందుకు రాజేందర్ సైతం తనకు గట్టి పట్టున్న హుజురాబాద్ నియోజకవర్గంలో నాయకులు అందరితోనూ మంతనాలు చేస్తూ, ఈ నియోజకవర్గంలో తన పట్టు చేజారిపోకుండా చూసుకుంటున్నారు.ఎవరూ టిఆర్ఎస్ ట్రాప్ లో పడవద్దని పదేపదే తన అనుచరులకు సూచిస్తున్నారు.అయినా టిఆర్ఎస్ రాజకీయం బాగా తెలిసిన రాజేందర్ ఆ పార్టీ ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు.
తాజాగా ఈరోజు హుజూరాబాద్ నియోజకవర్గం లో రాజేందర్ పర్యటించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు కీలకమైన అనుచరులతో ఆయన భేటీ అవుతూ ప్రస్తుత పరిణామాలపై చర్చిస్తున్నట్టు తెలుస్తోంది.
తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే, రాబోయే రోజుల్లో తలెత్తే పరిణామాలు, గెలుపు అవకాశాలు వంటి వాటి పైన ఆయన చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే కరోనా వైరస్ ప్రభావం తగ్గిన తర్వాత రాజకీయ పార్టీ పెట్టడమా ? మరేదైనా పార్టీలో చేరడమా అనే విషయంపైనా ఆయన కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది.ఈ పరిణామాలతో కాస్త ఆందోళనలో ఉన్న టిఆర్ఎస్ పూర్తిగా రాజేందర్ కదలికలపై నిఘా పెట్టి, ఆయన ఎవరెవరితో భేటీ అవుతున్నారు అనే విషయాలపైనా, ఆయన ముందు ముందు తీసుకోబోయే నిర్ణయాలు ఏ విధంగా ఉంటాయి , ఇలా అనేక అంశాలపై ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది.