యావత్ భారతదేశంలో కరోనా సెకండ్ వేవ్ ఎలాంటి విధ్వంసం సృష్టిస్తుందో అందరికీ తెలిసిందే.వేల సంఖ్యలో ప్రాణాలు పోతుండటంతో పలు రాష్ట్రాలు మరోసారి లాక్డౌన్ అమలు చేసి కరోనా కట్టడికి ప్రయత్నిస్తున్నాయి.
తెలంగాణలో కూడా కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తుండటంతో సీఎం కేసీఆర్ మే 12 నుండి లాక్డౌన్ విధించిన సంగతి తెలిసిందే.తొలుత ఈ లాక్డౌన్ను మే 21 వరకు అమలు చేయగా, ఇటీవల దీన్ని మే 30 వరకు పొడిగించారు.
దీంతో జనం అందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.మరోసారి లాక్డౌన్ విధించడంతో, ఈసారి ఎన్నిరోజులు ఉంటుందో అని వారు హైరానా పడుతున్నారు.
దీంతో ఒక్కసారిగా అందరూ రోడ్లపైకి వస్తుండటంతో పోలీసులకు పెద్ద తలనొప్పి వచ్చి పడింది.
అయితే రోజులో కేవలం నాలుగు గంటలు మాత్రమే లాక్డౌన్ సడలింపులు ఇచ్చింది ప్రభుత్వం.
ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు లాక్డౌన్ సడలింపు ఉండటంతో జనం నిత్యావసరాల కోసం రోడ్డుపైకి వస్తున్నారు.అయితే 10 దాటిన తరువాత కూడా జనం రోడ్లపై తిరుగుతుండటంతో వారిని నియంత్రించేందుకు పోలీసులు కఠిన నిర్ణయం తీసుకుంటున్నారు.10 దాటాక రోడ్లపై జనం కనిపిస్తే లాఠీలకు పనిచెప్పేందుకు రెడీ అవుతున్నారు.అయితే కొంతమంది నిర్లక్ష్యంగా రోడ్లపైకి వస్తుండటంతో తెలంగాణ పోలీసులు మరింత కఠినంగా వ్యవహరించేందుకు నిర్ణయిస్తున్నారు.
జనసంచారం ఎక్కువగా ఉంటున్న మార్కెట్లలో సంపూర్ణ లాక్డౌన్ విధించాలని పోలీసులు భావిస్తున్నారట.రోజూ రద్దీ ఎక్కువగా ఉండే మార్కెట్లను గుర్తించి, వారంలో ఒకరోజు పూర్తిగా లాక్డౌన్ విధించాలని పోలీసులు ఆలోచిస్తున్నారు.
ఈ విధంగానైనా జనం రద్దీని తగ్గించి, కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేయాలని వారు చూస్తున్నారు.మరి పోలీసుల ఆలోచన ఆచరణలో ఎంతవరకు వర్కవుట్ అవుతుందనేది చూడాలి.ఇక రాష్ట్రవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య కొద్దిమేర తగ్గుముఖం పడుతుండటం కొంత ఊరటకలిగించే విషయంగా చెప్పుకోవాలి.