ఈ మధ్య కాలంలో మోసగాళ్లు తెలివి మీరుతున్నారు.ఎవరూ ఊహించని విధంగా మోసాలకు పాల్పడుతున్నారు.
కళ్ల ముందే మోసం జరుగుతున్నా మోసం జరిగిందని కనిపెట్టలేని పరిస్థితి నెలకొంది.చదువుకున్న వాళ్లు సైతం ఈ మోసాల బారిన పడుతూ మోసపోతూ ఉండటం గమనార్హం.
మోసం చేసే ముఠాలు కొత్తదారుల్లో ప్రజలను పక్కదారి పట్టిస్తూ మోసాలకు పాల్పడుతున్నాయి.
రైస్ పుల్లింగ్, లంకె బిందెలు, గుప్త నిధులు, రెండు తలల పాము, బంగారు తాబేలు పేర్లతో మోసాలకు కాదేదీ అనర్హం అనే రీతిలో మోసాలు చేస్తున్నారు.
తాజాగా తెలంగాణ రాష్ట్రంలో పాత టీవీలు, రేడియోల్లోని వాల్వ్ ఇస్తే కోటి రూపాయలు ఇస్తామని… ఆ వాల్వ్ సహాయంతో గుప్త నిధులను కనుక్కోవచ్చని పోస్టులు వైరల్ అవుతున్నాయి.దీంతో కొందరు టీవీ, రేడియో షాపులకు పరుగులు తీస్తూ పాత టీవీలను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు.
సిద్దిపేట, వరంగల్, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాలలో ఈ తరహా ప్రచారం ఎక్కువగా జరుగుతోంది.ఈ ప్రచారం వల్ల కొందరు లక్షల రూపాయలు పెట్టి మరీ పాత టీవీలు కొనుగోలు చేస్తూ ఉండటం గమనార్హం.
అయితే మోసగాళ్లు గుప్త నిధుల పేరు చెప్పి టీవీ, రేడియో కొనుగోలు చేస్తామని మాయమాటలతో నమ్మించి మోసాలకు పాల్పడుతున్నారని… ఇలాంటి మోసాలపై అవగాహన పెంచుకుని జాగ్రత్త పడాలని పోలీసులు సూచిస్తున్నారు. నిధుల తవ్వకం పేరిట ముఠాలు మోసాలకు పాల్పడుతున్నాయని… ఎవరైనా గుప్త నిధులు తవ్విస్తామని చెబితే నమ్మకుండ జాగ్రత్త పడాలని సూచిస్తున్నారు.
నిపుణులు పాత టీవీ, రేడియోల్లోని ఎర్రటి వాల్వ్కు లోహాలను గుర్తించే సామర్థ్యం ఉండటంతో మోసగాళ్లు ఈ తరహా మోసాలకు పాల్పడుతున్నారు.కొందరు అప్పులు చేసి వాల్వ్లను సొంతం చేసుకున్నా వాటిని ఎవరికి విక్రయించాలో తెలియక తలలు పట్టుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.
ఇంట్లో పాత టీవీలు, రేడియోలు ఉన్నవాళ్లు జాగ్రత్త పడాలని చెబుతున్నారు.