కేంద్ర హోం మంత్రి అమిత్ షా పిలుపు మేరకు గవర్నర్ తమిళిసై దేశ రాజధాని ఢిల్లీకి వెళ్ళారు.తెలంగాణలోని తాజా రాజకీయ పరిస్థితులపై ఆమె సమగ్ర నివేదికను సమర్పించనున్నారు.
ఆ తర్వాత ప్రధానితోనూ గవర్నర్ భేటీ అయ్యే అవకాశం ఉంది.అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీలో ఉన్నప్పుడే గవర్నర్ను పిలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
రాష్ట్రానికి సంబంధించిన అన్ని అంశాలూ ఈ భేటీలో చర్చకు రానున్నాయి.
స్వయంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ మీద ఫోకస్ పెట్టినట్లు ఆ పార్టీ నాయకులు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు.
కేసీఆర్ ఢిల్లీలో ఉన్న సమయంలోనే గవర్నర్ను అమిత్ షా పిలిపించడం చర్చలకు దారితీసినట్లయింది.రాష్ట్రంలో రాజ్భవన్, ప్రగతిభవన్ మధ్య గ్యాప్ పెరిగిందంటూ స్వయంగా గవర్నరే వ్యాఖ్యలు చేశారు.
గ్యాప్ తన వైపు నుంచి జరగలేదని కూడా స్పష్టతనిచ్చారు.ప్రభుత్వం వైపు నుంచి పలు సందర్భాల్లో గవర్నర్కు ప్రోటోకాల్ సైతం అమలు కాలేదు.
ఈ విషయాన్ని ఆమె ప్రస్తావిస్తూనే.అయినా బాధపడటం లేదంటూ చెప్పుకొచ్చారు.
ఇప్పుడు ఢిల్లీ పర్యటన సందర్భంగా ఈ అంశాలన్నింటిపై హోంమంత్రికి గవర్నర్ వివరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.గవర్నర్ తన నివేదికలో ఏయే అంశాలను ప్రస్తావిస్తారు, హోంమంత్రితో ఏమేం చర్చిస్తారు, దాని తదుపరి కేంద్ర హోంశాఖ నుంచి ఎలాంటి యాక్షన్ ఉంటుంది, రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది.
ఇవీ ఇప్పుడు రాష్ట్రంలో ఆసక్తికరంగా మారాయి.
రాజ్భవన్, ప్రగతి భవన్ మధ్య గ్యాప్ పెరిగిపోవడంతో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఇబ్బందులు పడుతున్నారు.గవర్నర్ పలు పర్యటనల్లో అధికారులు కూడా పాల్గొనట్లేదు.కరోనా టైమ్లో నిమ్స్ ఆస్పత్రిని గవర్నర్ సందర్శించినప్పటి నుంచి ముఖ్యమంత్రి గవర్నర్కు గ్యాప్ మొదలైనట్లు తెలుస్తోంది.
కౌశిక్ రెడ్డిని సోషల్ సర్వీసు కేటగిరీ కింద నామినేటెడ్ పొస్టులో ఎమ్మెల్సీగా చేయాలని మంత్రిమండలి ఆమోదం తెలిపి ఫైల్ను రాజ్భవన్కు పంపిన తర్వాత ఆమోదం లభించకపోవడంతో ఇది తారాస్థాయికి చేరింది.ఆ గ్యాప్ ఇటీవలి కాలంలో మరింతగా పెరిగింది.