మనుషులు గుణపాఠాలు ఎప్పుడు నేర్చుకుంటారంటే తప్పులు, ప్రమాదాలు జరిగినప్పుడే.ఒకరి తప్పు నుంచి మరొకరు నేర్చుకుంటారు.
ఒకచోట జరిగిన దుర్ఘటన కారణంగా మరొకరు అప్రమత్తంగా ఉంటారు.ఆ దుర్ఘటన లేదా ప్రమాదం ఎందుకు జరిగిందో తెలుసుకొని అది తమ దగ్గర పునరావృత్తం కాకుండా జాగ్రత్త పడతారు.
ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం చేస్తున్నదిదే.గోదావరి పుష్కరాల తొలి రోజునే, పుష్కరాలు ప్రారంభమైన కొద్ది సమయంలోనే భారీగా తొక్కిసలాట జరిగి దాదాపు ముప్పయ్ మంది చనిపోయిన సంగతి తెలుసు.
ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నవారిలో ఎంతమంది బతుకుతారో తెలియదు.ఈ దుర్ఘటనపై మీడియాలో విశ్లేషణలు అనేకవిధాలుగా వచ్చాయి.
అసలు కారణం ఏదైనా దీన్నుంచి ఏపీ ప్రభుత్వం, అక్కడి అన్ని శాఖల అధికారులు గుణపాఠం నేర్చుకోవాలి.పొరుగు తెలుగు రాష్ర్టంలో దుర్ఘటన జరిగిన వెంటనే తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది.
కేసీఆర్ వెంటనే ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు.పుష్కరాలు జరుగుతున్న అన్ని ఊళ్లలోని ఘట్ల దగ్గర పరిస్థితిని తెలుసుకున్నారు.
ఆంధ్రాలో రాజమండ్రి ఎలాగో తెలంగాణలో భద్రాచలం అలాగ.కాబట్టి అక్కడ ఎక్కువ దృష్టి పెట్టారు.
నీళ్లు కూడా అక్కడే ఎక్కువ ఉన్నాయి కాబట్టి జనం ఎక్కువగా అక్కడికే వెళుతున్నారు.ఎక్కడా చిన్న ప్రమాదం కూడా జరగకూడదని కేసీఆర్ ఆదేశించారు.
తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో గోదావరిలో నీళ్లు లేవు కాబట్టి ఇక్కడి నుంచి కూడా చాలామంది రాజమండ్రికి వెళ్లారు.ప్రతి విషయంలోనూ రెండు తెలుగు రాష్ర్టాలు పోటీ పడుతున్నాయి కాబట్టి ఏ కార్యక్రమమైనా ఒకరిని మించి ఒకరు చేయాలని ‘చంద్రులు’ తాపత్రయపడుతున్నారు.
దీంతో ఏపీ ప్రభుత్వం రాజమండ్రిపై విపరీతమైన ప్రచారం చేసిందంటున్నారు.మీడియాలో ప్రవచనాలు చెప్పే ఆధ్యాత్మికవేత్తలు కూడా పుష్కరాల గురించి ఉన్నవీ లేనివీ చెప్పి సెంటిమెంటు విపరీతంగా పెంచారని, వీరు చెప్పినవాటిల్లో కొన్ని అవాస్తవాలు కూడా ఉన్నాయని కొందరు (వీరూ ఆధ్యాత్మిక ప్రసంగాలు చేసేవారే) చెప్పారు.
ఈ పుష్కరాలను ‘మహా పుష్కరాలు’ అని ప్రచారం చేశారని, వాస్తవానికి అఆంటిది ఏమీ లేదని అన్నారు.రాజమండ్రిలో ప్రమాదం జరిగిన పుష్కర ఘాట్పై కూడా అతి ప్రచారం జరిగిందని అంటున్నారు.
ఏది ఏమైనా తెలంగాణలో ప్రశాంత వాతావరణంలో పుష్కరాలు నిర్వహించడం అభినందనీయమే.ఆంధ్ర ప్రభుత్వమూ మేల్కొనాలి.