కరోనాతో ప్రస్తుతం ప్రపంచం అల్లాడిపోతోంది.దీనిని ఎలా కంట్రోల్ చేయాలో తెలియక ప్రభుత్వాలు తలలు పట్టుకుంటున్నాయి.
అందుబాటులో ఉన్న లాక్డౌన్, సామాజిక దూరం వంటి చిట్కాలతో తాత్కాలికంగా అదుపు చేసేందుకు దేశాధినేతలు ప్రయత్నిస్తున్నారు.వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే వరకు పరిస్ధితి ఇలాగే ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
విపత్కర పరిస్ధితుల్లో ప్రజలకు, ప్రభుత్వానికి సాయం చేసేందుకు పలువురు మంచి మనుషులు ముందుకు వస్తున్నారు.వీరితో పాటు ప్రపంచం గురించి తెలియని చిన్నారులు కూడా సాయం చేస్తూ ప్రశంసలు పొందుతున్నారు.
తాజాగా తెలంగాణకు చెందిన 12 ఏళ్ల ఎన్ఆర్ఐ బాలిక మాతృదేశం కోసం ఫండ్ రైజింగ్ కార్యక్రమానికి పిలుపునిచ్చి 4.500 డాలర్లు సేకరించింది.టీఆర్ఎస్ నేత, మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే గడ్డం అరవింద్ రెడ్డి మనవరాలు, 12 ఏళ్ల భవ్య రెడ్డి అమెరికాలో గ్రేడ్ X చదువుకుంటోంది.కరోనా కారణంగా భారతదేశంలోని ప్రజలు పడుతున్న కష్టాలు చూసి చలించిపోయిన ఆ బాలిక ఏదో ఒక సాయం చేయాలని భావించింది.దీనిలో భాగంగా ‘‘GoFundMe.com’’లో ‘‘DoSomething’’ అంటూ విరాళాల సేకరణ ప్రారంభించింది.
అలాగే భారతదేశంలో మహమ్మారి బారినపడిన వారికి సహాయం చేయవలసిన అవసరాన్ని వివరిస్తూ భవ్య ట్విట్టర్లో వీడియో సందేశాన్ని పోస్ట్ చేసింది.మహమ్మారి కారణంగా చాలా మంది ఉద్యోగాలు కోల్పోయారని… ఆహారం, ప్రాథమిక అవసరాలు లేకుండా భారత్లో చాలా మంది ఉన్నారు అని ఆమె తన సందేశంలో పేర్కొంది.ఆ చిన్నారి ఇచ్చిన పిలుపుకు స్థానికులు, భారతీయ అమెరికన్ల నుంచి అనూహ్య స్పందన వచ్చింది.ఇప్పటి వరకు సుమారు 4,500 డాలర్లు ( భారత కరెన్సీలో రూ.5 లక్షలు) సమకూరాయి.
దీనిపై భవ్యా రెడ్డి తాతయ్య, టీఆర్ఎస్ నేత అరవింద్ రెడ్డి మాట్లాడుతూ.ఈ నిధులను మంచిర్యాల జిల్లాలో లాక్డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన పేదలు, రోజుకూలీలు, టైలర్లు, ఇతర వర్గాలకు నిత్యావసరాలు సమకూర్చేందుకు ఉపయోగిస్తామని తెలిపారు.
కాగా గత కొన్ని రోజులుగా మంచిర్యాల పట్టణంలోని సంగమయ్య నగర్, తిలక్ నగర్ , రాజీవ్ నగర్, ఎన్టీఆర్ నగర్, నజీర్ పల్లి వంటి ప్రాంతాల్లో సుమారు 2 వేల మంది పేదలకు అరవింద్ రెడ్డి కిరాణా సరకులు అందజేసి మానవత్వాన్ని చాటుకున్నారు.అరవింద్ రెడ్డి పెద్ద కుమార్తె లావణ్య ఆమె భర్త, రేడియోలాజిస్ట్ అవినాష్ రెడ్డితో కలిసి 17 సంవత్సరాలుగా అమెరికా టేనస్సీ రాష్ట్రంలోని జాన్సన్ నగరంలో నివసిస్తున్నారు.
వీరి కుమార్తె భవ్యా రెడ్డి.