కుటుంబాన్ని పోషించేందుకు ఉపాధి వెతుక్కుంటూ దుబాయ్ వెళ్లిన ఓ వ్యక్తి మానసిక స్థితి సరిగా లేక 16 ఏళ్ల పాటు అష్టకష్టాలు పడి ఎట్టకేలకు మాతృదేశానికి చేరుకున్నాడు.కామారెడ్డి జిల్లా దోమలకొండ మండలం చింతమన్పల్లికి చెందిన నీల ఎల్లయ్య అనే వ్యక్తిది అంతులేని వ్యథ.
ఆయన 2004లో దుబాయ్లోని ఓ కంపెనీలో భవన నిర్మాణ కార్మికుడిగా చేరాడు.కొంతకాలం తర్వాత మానసిక స్థితి సరిగా లేకపోవడంతో అక్కడ పని మానేశాడు.
కొన్నాళ్లపాటు అక్కడక్కడా ఏదో పని చేసుకుంటూ కడుపు నింపుకున్నాడు.
ఇదే సమయంలో దుబాయ్లో అక్రమంగా ఉంటున్న వారిని వెనక్కి పంపించేందుకు అక్కడి అధికారులు 2007లో చర్యలు తీసుకోవడంతో ఎల్లయ్య వారికి పాస్పోర్టు అప్పగించాడు.
అయితే ఆయన వీసా గడువు ఎప్పుడో ముగిసిపోయింది.యూఏఈ నిబంధల ప్రకారం వీసా గడువు ముగిసినప్పటికీ తమ దేశంలో అక్రమంగా వుండేవారు రోజుకీ 25 దిర్హామ్స్ (రూ.500) జరిమానా చెల్లించాల్సి వుంటుంది.దీని ప్రకారం 16 ఏళ్లకు గాను 1.46 లక్షల దిర్హామ్స్ (భారత కరెన్సీలో రూ.29 లక్షలు) కట్టాలి.ఇంత మొత్తం చెల్లించే స్థోమత ఎల్లయ్యకు లేదు.
కరోనా విపత్కర పరిస్థితుల నేపథ్యంలో దుబాయ్, షార్జా ప్రాంతాల్లోని వలస కార్మికులకు జైన్ సేవా మిషన్ వాలంటీర్ రూపేష్ మెహతా ఉచితంగా నిత్యావసరాలు పంపిణీ చేస్తున్నాడు.
ఆ సమయంలో ఎల్లయ్య దయనీయ స్థితిని గమనించి వివరాలు తెలుసుకున్నాడు.వెంటనే ఇండియన్ కాన్సులేట్ ద్వారా ఎల్లయ్యకు ఎమర్జెన్సీ సర్టిఫికెట్ ఇప్పించి స్వదేశానికి పంపించడానికి రూపేష్ మెహతా ప్రయత్నించారు. కానీ బాధితుడు 16 ఏళ్ల క్రితం యూఏఈలోకి వచ్చినప్పుడు వున్న పాస్పోర్ట్ వివరాలు ఇస్తేనే తాత్కాలిక పాస్పోర్ట్ జారీ చేయడం వీలవుతుందని భారత రాయబార కార్యాలయం అధికారులు వెల్లడించారు.కానీ రూపేశ్ వదిలిపెట్టలేదు… వెంటనే తెలంగాణలోని ప్రవాసి మిత్ర లేబర్ యూనియన్ కార్యాలయాన్ని సంప్రదించాడు.
జూలై 27న ప్రవాసి మిత్ర ప్రతినిధులు చింతమన్పల్లిలోని ఎల్లయ్య భార్య రాజవ్వకు విషయం తెలియజేశారు.దీనితో పాటు ఆమెను వెంటబెట్టుకుని సికింద్రాబాద్లోని పాస్పోర్ట్ కేంద్రంలో తన భర్త పాస్పోర్ట్ నెంబర్, ఇతర వివరాలను అందించాలని దరఖాస్తు చేయించారు.
అంతా సజావుగా జరుగుతున్న సమయంలో దుబాయ్లో అక్రమంగా వున్నందుకు గాను అక్కడి ప్రభుత్వం విధించిన జరిమానా రూ.29 లక్షలు ప్రతిబంధకంగా మారింది.మళ్లి రంగంలోకి దిగిన రూపేశ్.ఈ విషయాన్ని భారత కాన్సులేట్ అధికారుల దృష్టికి తీసుకెళ్లి.దుబాయ్ అధికారులకు ఎల్లయ్య పరిస్థితిని వివరించారు.దీంతో దుబాయ్ ప్రభుత్వం ఎల్లయ్యపై వున్న రూ.29 లక్షల జరిమానాను మాఫీ చేయడంతో పాటు, యూఏఈ విడిచి వెళ్లేందుకు అనుమతి కూడా ఇచ్చింది.
చట్టపరమైన అడ్డంకులన్నీ తొలగిపోవడంతో భారత కాన్సులేట్ కార్యాలయం ఎల్లయ్యకు కావాల్సిన ధృవపత్రాలను సిద్ధం చేయడంతో పాటు దుబాయ్ నుంచి హైదరాబాద్కు ఉచిత విమాన టికెట్ ఏర్పాటు చేసింది.
దీంతో దాదాపు 16 సంవత్సరాల తర్వాత ఎల్లయ్య భారత గడ్డ మీద అడుగుపెట్టాడు.మంగళవారం శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న ఎల్లయ్య.భార్య, ఇతర కుటుంబసభ్యులను చూసి ఉద్వేగానికి గురయ్యాడు.ఈ సందర్భంగా భారత్కు వచ్చేందుకు తనకు ఎంతో సహకరించిన సామాజిక కార్యకర్త రూపేశ్ మెహతా, ఇండియన్ కాన్సులేట్, దుబాయ్ ప్రభుత్వానికి ఎల్లయ్య ధన్యవాదాలు తెలిపాడు.