ఎన్నో ఆశలతో, ఉజ్వలమైన భవిష్యత్తు కోసం, తల్లి తండ్రులు పడిన కష్టానికి ప్రతిఫలం ఇవ్వడం కోసం దేశం కాని దేశం వెళ్ళిన తెలుగు యువకుడు ప్రమాదవశాత్తు మృతి చెందిన ఘటన ఆ యువకుడి కుటుంభంలో తీవ్రమైన విషాదం నింపి వెళ్ళింది.త్వరలో ఇంటికి వస్తానని చెప్పిన కొడుకు ఇక తిరిగి రాడనే వార్తను తట్టుకోలేని తల్లి తండ్రులు కుప్పకూలిపోయారు.
అమెరికాలోని జరిగిన ఈ ఘటన ఆ యువకుడి తల్లి తండ్రులకు పుట్టెడు శోకం మిగిల్చింది.వివరాలలోకి వెళ్తే.
తెలంగాణ రాష్ట్రం సూర్యా పేట జిల్లా, కోదాడకు చెందిన రవి కుమార్ చదువుల్లో ముందుండే వారు, ఏంఎస్ అమెరికాలో చేయాలని అనుకున్నప్పుడు తల్లి తండ్రులు ఎలాంటి అభ్యంతరం చెప్పకుండా కొడుకు కోరిక మేరకు 2018 లో అమెరికా పంపారు.అక్కడ ఏంఎస్ చదువుతూనే చిన్న ఉద్యోగాలు చేస్తూ, తల్లి తండ్రులు పంపే డబ్బుతో కష్టపడి చదివిన రవి కుమార్ క్రిందటి సంవత్సరం ఏంఎస్ పూర్తి చేశారు.
అమెరికాలోనే ప్రముఖ భీమా సంస్థలో ఉద్యోగం కూడా సంపాదించారు.అంతా బాగుందనుకున్న క్రమంలో ఒక్క సారిగా అతడి కుటుంభాన్ని విషాదంలో ఉంచి వెళ్ళిపోయారు కుమార్.
నిన్నటి రోజున అమెరికాలోని తన స్నేహితులతో కలిసి సరదాగా విహార యాత్రకు వెళ్ళిన రవి కుమార్ అక్కడ బోటింగ్ ఆసక్తి కరంగా ఉండటంతో మిత్రులతో కలిసి బోటింగ్ ప్రయాణం చేశారు.ఈ సమయంలో ఊహించని విధంగా ప్రమాదవశాత్తు పడవలోంచి నీటిలో పడిన రవి కుమార్ మృతి చెందారు.
ఈ విషయాన్ని సన్నిహితులు పోలీసులకు తెలియజేయగా, పోలీసులు అధికారుల సాయంతో భారత్ లో ఉన్న అతడి తల్లి తండ్రులకు సమాచారం అందించారు.దాంతో ఆయన ఇంటివద్ద విషాదం అలుముకుంది.
త్వరలో ఇంటికి తిరిగివస్తాడని అనుకున్న తమకు ఇలాంటి వినాల్సి వచ్చిందని కన్నీరు మున్నీరు అవుతున్నారు తల్లి తండ్రులు.రవి కుమార్ కు ఓ తమ్ముడు కూడా ఉన్నారు.
ఇదిలాఉంటే రవి కుమార్ మృత దేహాన్ని స్వస్థలానికి రప్పించాలని కేసీఆర్, కెటిఆర్ కు కుటుంభ సభ్యులు విజ్ఞప్తి చేస్తున్నారు.
.