మిగిలిన దేశాలతో పోలిస్తే గల్ఫ్ దేశాల్లో నేరాలకు శిక్షలు కఠినంగా ఉంటాయి.ప్రజలు నేరం చేయాలంటేనే వెన్నులో వణుకు పుట్టేలా.
బహిరంగంగా శిక్షలు అమలు చేస్తారు అక్కడి అధికారులు.ఇలాంటి పరిస్ధితుల్లో కరోనా రావడంతో సౌదీ అరేబియా ప్రభుత్వం లాక్డౌన్ విధించి కఠిన ఆంక్షలను అమలు చేస్తోంది.
దీంతో భారతీయులు అక్కడ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
తాజాగా మనదేశానికి చెందిన ఓ వ్యక్తి అడ్డంగా బుక్కయ్యాడు.ఆకలి బాధను తట్టుకోలేక రొట్టే కొనుక్కుందామని రోడ్డు దాటుతుండగా అతనిని పట్టుకున్న పోలీసులు లాక్డౌన్ నియమాలను ఉల్లంఘించాడని 10వేల రియాల్ ( భారత కరెన్సీలో రూ.2 లక్షలు) జరిమానా విధించారు.
తెలంగాణ రాష్ట్రం మంచిర్యాల జిల్లాకు చెందిన అమరగొండ శ్రీనివాస్ అనే వ్యక్తి ఉపాధి నిమిత్తం 7 నెలల కింద సౌదీ అరేబియా వెళ్లాడు.అక్కడ ఉద్యోగం కోసం వెతుకుతున్నప్పటికీ ఎలాంటి ఫలితం లేదు.ఏదో ఒక చిన్న పని దొరుకుతుందన్న ఆశతో రోజులు నెట్టుకొస్తున్నాడు.ఇలాంటి పరిస్ధితుల్లో లాక్డౌన్ విధించడంతో శ్రీనివాస్ పరిస్ధితి మరింత దారుణంగా తయారైంది.
ఈ క్రమంలో ఆకలి తీర్చుకోవడం కోసం రొట్టె కొనుక్కోవడానికి రోడ్డు దాటుతున్న అతనిని పోలీసులు పట్టుకున్నారు.లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన నేరంపై పదివేల రియాల్ల ఫైన్ వేసింది.
తాను నిరుపేదనని, ఉపాధి కోసం ఎన్నో కష్టాలుపడి సౌదీకి వచ్చానని అతను చెప్పాడు.తాను జరిమానా కట్టేంత వరకు ఆ దేశాన్ని వీడలేనని అధికారులు అంటున్నారని.
కానీ అంత డబ్బు తన దగ్గర లేదని శ్రీనివాస్ వాపోతున్నాడు.తనను ఆదుకోవాల్సిందిగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ను వేడుకుంటున్నాడు.