దేశం కానీ దేశంలో అష్టకష్టాలు పడి తనను రక్షించాల్సిందిగా తెలంగాణ ప్రభుత్వాన్ని సెల్ఫీ వీడియోలో అభ్యర్ధించిన ఎన్ఆర్ఐ సుదీర్ఘ పోరాటం తర్వాత ఎట్టకేలకు స్వదేశానికి చేరుకున్నాడు.జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన 50 ఏళ్ల బూశా శ్రీనివాస్ అనే వ్యక్తి ఉపాధి నిమిత్తం షార్జాకు వెళ్లాడు.
ఈ నేపథ్యంలో గతేడాడి డిసెంబర్లో తాను పరాయి దేశంలో పడుతున్న బాధలను సెల్ఫీ వీడియో ద్వారా తెలియజేశాడు.
కఠినమైన పని పరిస్థితులతో పాటు 24 గంటలూ పనిచేయాలని తన యజమాని ఒత్తిడి చేస్తున్నాడని, దీనితో తనకు నిద్ర, విశ్రాంతి కరువయ్యాయని శ్రీనివాస్ వాపోయాడు.
అంతేకాకుండా జరిమానా సైతం విధించారని తాను భారతదేశానికి వచ్చేందుకు సాయం చేయాల్సిందిగా వాట్సాప్ ద్వారా సెల్ఫీ వీడియోను పంపాడు.తన వీడియోను చూసిన వారు విషయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లాలంటూ శ్రీనివాస్ విజ్ఞప్తి చేశాడు.
అయితే దురదృష్టవశాత్తూ.ఈ వీడియో క్లిప్ షార్జాలోని ఓ న్యూస్ రిపోర్ట్ ద్వారా అతని యజమాని దృష్టికి వచ్చింది.
దీంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన… శ్రీనివాస్ను ఉద్యోగం నుంచి తొలగించడంతో పాటు అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు.దీంతో శ్రీనివాస్ పరిస్ధితి పొయ్యి మీద నుంచి పెనం మీద పడ్డట్లుగా తయారైంది.
శ్రీనివాస్ దేశం విడిచి వెళ్లకుండా షార్జా పోలీసులు కట్టుదిట్టం చేశారు.దీంతో అతను స్థానిక కోర్టులో విచారణకు హాజరయ్యాడు.
ఈ సందర్భంగా తనకు యజమాని పరువు తీసే ఉద్దేశం లేదని, సదరు వీడియోని ముఖ్యమంత్రికి పంపాల్సిందిగా తన భార్యకు మాత్రమే చెప్పానని న్యాయస్థానానికి తెలిపాడు.
ఈ ఊహించని న్యాయ సమస్యలతో భయాందోళనలకు గురైన శ్రీనివాస్ కుటుంబం తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ ద్వారా విదేశాంగ మంత్రితో సంప్రదింపులు జరిపింది.ఇదే సమయంలో షార్జాలో తెలంగాణకే చెందిన ముజాఫర్ షేక్ అనే సామాజిక కార్యకర్త.ఎంపీ బండి సంజయ్ సలహా మేరకు శ్రీనివాస్కు న్యాయపరమైన అంశాల్లో సాయం చేశాడు.
అతని శ్రమ ఫలించి కోర్టు శ్రీనివాస్ను నిర్దోషిగా ప్రకటించింది.అనంతరం పట్టరాని సంతోషంతో వందే భారత్ మిషన్ విమానంలో శ్రీనివాస్ భారతదేశానికి చేరుకున్నాడు.