దేశం కానీ దేశంలో కొడుకు అరెస్ట్ కావడం అక్కడ సాయం చేసే వారు ఎవ్వరూ లేకపోవడంతో తమను ఆదుకోవాల్సిందిగా ఓ తండ్రి భారత ప్రభుత్వానికి మొర పెట్టుకున్నాడు.
తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఫాసియుద్దీన్ పోలాండ్లోని ఓ సంస్థతో కలిసి పనిచేస్తున్నాడు.
మే 23 2017లో తన కుమారుడు పోలాండ్కు వెళ్లాడని, అక్కడ ఓ ఏజెంట్ ఫాసియుద్దీన్కు వర్క్ వీసా ఇప్పిస్తానని చెప్పి పారిపోయాడని తెలిపారు.అయినప్పటికీ తమ కుమారుడు నిరాశ చెందకుండా అక్కడే ఓ కంపెనీలో పనిచేస్తూ వర్క్ వీసా పొందేందుకు ప్రయత్నిస్తున్నాడని ఫాసియుద్దీన్ తండ్రి నజాముద్దీన్ పేర్కొన్నారు. తన కుమారుడితో గతేడాది అక్టోబర్ 21న చివరిసారిగా మాట్లాడానని, ఆ తర్వాత అతని నుంచి ఎలాంటి ఫోన్ రాలేదని ఆయన తెలిపాడు.అయితే కొన్ని రోజుల తర్వాత తమకు పోలాండ్లోని భారత రాయబార కార్యాలయం నుంచి కాల్ వచ్చింది.
ఫాసియుద్దీన్ను అధికారులు అరెస్ట్ చేసి జైలుకు పంపినట్లు ఇండియన్ ఎంబసీ తెలిపిందని నజాముద్దీన్ కన్నీటి పర్యంతమయ్యారు.అసలు ఫాసియుద్దీన్కు ఎందుకు అరెస్ట్ చేశారో, అతనిపై ఏ కేసు నమోదైందో తమకు తెలియదన్నారు.
అయితే ఒక ట్వీట్కు సమాధానమిచ్చిన ఇండియన్ ఎంబసీ అధికారులు….ఫాసియుద్దీన్ను సైబర్ క్రైమ్ కేసులో పోలాండ్ అధికారులు అరెస్ట్ చేసినట్లు చెప్పారు.ఆ దేశంలో తమకు తెలిసిన వారు ఎవరూ లేరని.అతనికి న్యాయ సహాయం అందించి, తిరిగి భారతదేశానికి వచ్చేలా చేయాలంటూ నజాముద్దీన్ కేంద్ర ప్రభుత్వాన్ని, పోలాండ్లోని భారత రాయబార కార్యాలయాన్ని అభ్యర్ధిస్తున్నారు.
అయితే ఫాసియుద్దీన్ను కాన్సులర్ ఆఫీసర్ కలిశారని, ఒక న్యాయవాదిని నియమించారని ఇండియన్ ఎంబసీ తెలిపింది.దర్యాప్తు పూర్యయ్యే వరకు తాము ఎదురుచూస్తామని, నిబంధనల ప్రకారం అవసరమైన సాయాన్ని అతనికి అందిస్తామని పోలాండ్లోని భారత రాయబార కార్యాలయం ట్వీట్టర్ ద్వారా నజాముద్దీన్కు సమాచారం అందించింది.