తెలంగాణ బీజేపీ అనగానే మొదటగా గుర్తుకువచ్చే పేరు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.తెలంగాణలో బీజేపీకి ఒక ఊపు తీసుకురావడంలో బండి సంజయ్ చూపించిన చొరవ మామూలుది కాదు.
కేవలం పేరుకు మాత్రమే అన్నట్లుగా తెలంగాణ లో బీజేపీ ఉండేది.కానీ బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడు అయిన తర్వాత, గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయగలరు.
ఇటీవల దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికలలో బీజేపీ గెలవడానికి, అలాగే జిహెచ్ఎంసి ఎన్నికలలో టిఆర్ఎస్ పార్టీకి వచ్చిన ఫలితాలకు దగ్గరగా బీజేపీకి స్థానాలు రావడానికి బండి సంజయ్ చేసిన కృషి మాటల్లో చెప్పలేనిది.పార్టీలో గ్రూపు రాజకీయాలు ఉన్న, రాష్ట్ర అధ్యక్షుడిగా అంతిమ నిర్ణయం తీసుకోవాల్సింది ఆయనే.
అయితే ఇప్పుడు అటువంటి బండి సంజయ్ ను పట్టించుకోనట్టుగా కొంతమంది నాయకులు వ్యవహరించిన తీరు తీవ్ర ఆగ్రహాన్ని కలిగిస్తోంది.అది కాకుండా తాము పూర్తిగా రాజకీయ ప్రత్యర్థిగా భావిస్తున్న టిఆర్ఎస్ నేతలను బీజేపీ నాయకులు వెళ్ళి కలవడం బండి సంజయ్ తీవ్రంగా పరిగణిస్తున్నారు.
ఇంతకీ విషయం ఏంటంటే, ఇటీవల జరిగిన గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో లింగోజిగూడ డివిజన్ నుంచి బీజేపీ అభ్యర్థి గెలిచారు.కాకపోతే దురదృష్టవశాత్తు ఆయన ప్రమాణస్వీకారం చేయకముందు చనిపోయారు.దీంతో అక్కడ ఉప ఎన్నిక రాబోతోంది.అయితే బీజేపీ కార్పొరేటర్ కుటుంబ సభ్యున ఏకగ్రీవంగా గెలిపించేందుకు ఆ నియోజకవర్గం బీజేపీ నేతలంతా కలిసి కేటీఆర్ అపాయింట్మెంట్ తీసుకుని , ఆయనను కలిశారు.
తమ నిర్ణయాన్ని కేటీఆర్ కు చెప్పగా, ఆయన సానుకూలంగా స్పందించి లింగోజిగూడ నుంచి టిఆర్ఎస్ అభ్యర్థిని పోటీకి పెట్టకూడదు అని నిర్ణయించుకున్నారు.దీంతో బీజేపీ నేతలు హర్షం వ్యక్తం చేశారు.
అయితే ఈ వ్యవహారాన్నే బండి సంజయ్ తీవ్రంగా పరిగణిస్తున్నారు.బీజేపీకి సిట్టింగ్ స్థానమైన ఆ డివిజన్ లో మళ్లీ ఎన్నికలకు వెళ్లినా భారీ మెజార్టీతో గెలుస్తుందని అటువంటిది టిఆర్ఎస్ నాయకుల వద్దకు బీజేపీ నాయకులు వెళ్లి ఈ విషయంపై కలవడం, కనీసం దీనికి సంబంధించి తన అనుమతి సైతం తీసుకోకపోవడం ఏంటనేది సంజయ్ ఆగ్రహానికి కారణమైంది.
పోనీ ఇక్కడ టిఆర్ఎస్ పోటీ కి పెట్టక పోయినా, ఆ సీటు బీజేపీకే దక్కుతుందా అంటే అదీ లేదు.ఎందుకంటే ఇక్కడ నుంచి కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్రెడ్డి అనుచరుడు పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు.కాబట్టి ఇక్కడ ఎన్నిక అనివార్యం అవుతుంది.అలాగే టిఆర్ఎస్ నేతల నుంచి ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో, ఆ పార్టీ పోటీ చేసేందుకు సిద్ధమవుతోంది.ఇటువంటి సమయంలో బీజేపీ నేతలు టిఆర్ఎస్ నాయకులను కలవడం వల్ల తప్పుడు సంకేతాలు వెళ్తాయనే బండి సంజయ్ ఆగ్రహంతో ఉన్నారట.