తెలంగాణ సీఎం కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకున్నా, అది పెద్ద సంచలనంగానే ఉంటుంది.ప్రజల నాడిని ఎప్పటికప్పుడు పసిగడుతూ, వారి అభిప్రాయానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటూ, ప్రజల్లో క్రెడిట్ సంపాదించడంలో కేసీఆర్ ఎప్పుడూ పైచేయి సాధిస్తూ వస్తున్నారు.
ఇదే విధంగా తెలంగాణలో కొత్త మున్సిపల్ చట్టాన్ని తీసుకువచ్చి సంచలనం సృష్టించారు.ఈ చట్టం ఏర్పాటుపై ఉద్యోగుల నుంచి తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తమైనా, ఈ చట్టాన్ని కేసీఆర్ తీసుకువచ్చారు.
ఇప్పుడు రాష్ట్రంలో అదే విధంగా మరో కొత్త చట్టాన్ని తీసుకు వచ్చేందుకు కేసీఆర్ కసరత్తు చేస్తుండటంతో, ఇదో పెద్ద సంచలనంగా మారే అవకాశం కనిపిస్తోంది.తెలంగాణను అవినీతి రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారు.
గతంలోనే కొత్త రెవెన్యూ చట్టం అమలు చేసేందుకు కేసీఆర్ సిద్ధమైనా, ఉద్యోగ సంఘాల నుంచి తీవ్రస్థాయిలో నిరసనలు వ్యక్తం కావడంతో ఆ నిర్ణయాన్ని వాయిదా వేశారు.కానీ రెవెన్యూ శాఖ పై తరుచుగా పెద్ద ఎత్తున విమర్శలు వస్తుండడం, పెద్ద ఎత్తున అవినీతి వ్యవహారాలు చోటుచేసుకోవడం వంటి వాటితో కొత్త రెవెన్యూ చట్టం తీసుకొచ్చేందుకు కేసీఆర్ సిద్ధమవుతున్నారు.
కొద్దిరోజుల క్రితమే ఎమ్మార్వో నాగరాజు కోటి పది లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు దొరికిపోవడంతో రెవెన్యూ శాఖపై ప్రజలలో మరింత చులకన భావం ఏర్పడింది.దీంతో కేసీఆర్ రెవెన్యూ శాఖను ప్రక్షాళన చేయాలని చూస్తున్నారు.
దీనిలో భాగంగానే వీఆర్వోల వ్యవస్థను పూర్తిగా రద్దు చేయాలని, ప్రస్తుతం ఉన్న వీఆర్వోలను ఇతర శాఖలోకి సర్దుబాటు చేయాలని చూస్తున్నారు.ఈ మేరకు వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో దీనికి సంబంధించిన బిల్లును ప్రవేశ పెట్టేందుకు కేసీఆర్ సిద్ధమవుతున్నారు.అలాగే భూముల కొనుగోలు, అమ్మకాల విషయంలోనూ అనేక లోపాలు ఉన్నాయని, ఇకపై అటువంటి వ్యవహారాలకు ఎటువంటి ఆస్కారం లేకుండా, పకడ్బందీగా రెవెన్యూ చట్టం తీసుకురావాలని, ఆన్లైన్ ద్వారానే అన్ని పనులు చక్కబెట్టే విధంగా కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం ఈ వ్యవహారం ఊపందుకోవడంతో దీనిపై ఉద్యోగ సంఘాల నుంచి ఎటువంటి స్పందన వస్తుందో అనేది ఆసక్తికరంగా మారింది.
కానీ ఈ సారి మాత్రం ఎంత రాద్ధాంతం జరిగినా ఈ చట్టాన్ని అమలు చేసి తీరాలనే ధృడ నిశ్చయంతో కేసీఆర్ ఉన్నట్టుగా కనిపిస్తున్నారు.