తెలంగాణ సర్కార్ మహిళల కోసం షీ టాయిలెట్లు నిర్మించబోతున్న విషయం అందరికీ తెలిసిందే.మహిళల సౌకర్యార్థం బస్ స్టాప్ లో, రైల్వే స్టేషన్ల వద్ద, రద్దీ ప్రాంతాల్లో షీ టాయిలెట్లు నిర్మిస్తోంది.
రాష్ట్ర ప్రభుత్వం పారిశుద్ధ్య కార్యక్రమంలో భాగంగా దేశంలోనే ఎక్కడా లేని విధంగా అత్యధికంగా ఆరువేల షీ టాయిలెట్లు నిర్మించడంపై పలువురు నెటిజన్లు అభినందనలు తెలుపుతున్నారు.రాష్ట్రంలోని నగరాలు, పట్టణాల్లో యుద్ధ ప్రాతిపదికన నిర్మిస్తున్న టాయిలెట్ల నిర్వహణలో స్లమ్ లెవల్ కమిటీలు, మహిళా సంఘాలు, ముఖ్యంగా థర్డ్ జెండర్ వారిని భాగస్వామ్యం చేయడంపై పలువురు ప్రశంసల వర్షం కురింపించారు.
రాష్ట్రంలో పారిశుద్ధ్య నిర్వహణపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది.పర్యావరణాన్ని పెంపొందించేందుకు హరితహారం కార్యక్రమాన్ని ముమ్మరం చేసింది.ముఖ్యంగా పట్టణ పరిసర ప్రాంతాల్లో, నగరాల్లో కాలుష్యాన్ని నియంత్రించాలని భావిస్తోంది.భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన గాలికి అందించేందుకు ఆరాటపడుతోంది.
దీంతోపాటుగా టాయిలెట్ల ఏర్పాటు కూడా చేస్తోంది.ఇప్పటికే రాష్ట్రంలో పారిశుద్ధ్య పనులు మెరుగుపర్చేందుకు ఆయా డివిజన్ల అధికారుల నుంచి సలహాలు, సూచనలు, ప్రణాళికలు రూపొందించి అందించాలని ఆదేశించింది.
అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (ఏఎస్ సీఐ), దస్రా ఫౌండేషన్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం రాష్ట్ర పారిశుద్ధ్య నిర్వహణపై ట్వీట్ చాట్ నిర్వహించారు.
గంటన్నర పాటు జరిగిన ఈ ట్వీట్ చాట్ లో పలువురు ప్రముఖులు, సామాన్యులు పాల్గొన్నారు.
అయితే ఈ ట్వీట్లపై వారు ఈ క్రింది విధంగా మాట్లాడారు.పారిశుద్ధ్య నిర్వహణకు సంబంధించి నిర్ణయాలు తీసుకునే కమిటీలో మహిళల ప్రాతినిధ్యం పెంచాలన్నారు.
పారిశుద్ధ్య నిర్వహణపై యువజన సంఘాలు, స్వచ్ఛంద సంస్థల పర్యవేక్షణ ఉండాలన్నారు.ప్రతిభావంతులైన గ్రామ కమిటీ సభ్యులు, ఎన్జీవోల, సామాన్యులను గుర్తించి వారి ఆధ్వర్యంలో పర్యవేక్షణ పనులు జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు.
తెలంగాణలో థర్డ్ జెండర్ వారికి ప్రాధాన్యత ఇవ్వడం అభినందకరంగా ఉందన్నారు.డివిజన్ పరిధిలో ఉన్న సమస్యలను సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజాప్రతినిధులకు తెలిసేలా చర్యలు తీసుకోవాలని వారు పేర్కొన్నారు.