హైదరాబాద్: తెలంగాణలో ఈరోజు నుంచి విద్యా సంస్థలు తెరుచుకున్నాయి.చాలాకాలంగా విద్యాలయాలకు దూరమైన విద్యార్థులు ఉత్సాహంగా తరగతులకు హాజరయ్యారు.
ఈ నేపధ్యంలో రాష్ట్ర గవర్నర్ తమిళ సై రాజ్ భవన్ ప్రభుత్వ పాఠశాలను సందర్శించారు.విద్యార్థులకు మాస్కులు అందజేసి, కరోనా సోకకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేశారు.
కొవిడ్ నిబంధనలు పాటిస్తూ, పిల్లల ఆరోగ్యాన్ని కాపాడుకున్న తల్లిదండ్రులను గవర్నర్ అభినందించారు.ఇటువంటి జాగ్రత్తలు భవిష్యత్తులోనూ తీసుకోవాల్సిన అవసరం ఉందని విద్యార్థులకు ఆమె సూచించారు.
ఈ సందర్భంగా గవర్నర్ తమిళిసై కాసేపు టీచర్ గా మారిపోయి, విద్యార్థులలో కలిసిపోయి వారితో ముచ్చటించారు.పిల్లలకు, సిబ్బందికి కొవిడ్ జాగ్రత్తల గురించి చెప్పారు.
ప్రతి క్లాస్ రూమ్లో తిరుగుతూ పిల్లలను పలుకరించారు.మాస్క్ ఏవిధంగా ధరించాలి? శానిటైజ్ ఎలా చేసుకోవాలి? తదితర విషయాలను విద్యార్థులకు అర్ధమయ్యేలా యాక్షన్ చేసి మరీ వివరించారు గవర్నర్ తమిళసై.
స్కూళ్లు తెరుచుకోవడంతో విద్యార్థుల్లో అపరిమితమైన ఆనందం కనిపిస్తున్నదన్నారు.క్లాస్ రూమ్లో, ప్లే గ్రౌండ్లో, వాష్ రూమ్లో ఇలా ఎక్కడైనా విద్యార్థులు తప్పనిసరిగా భౌతిక దూరం పాటించాలన్నారు.టీచర్లు, స్కూల్ సిబ్బంది కరోనా జాగ్రత్తలు తీసుకోవాలని, పిల్లలు కరోనా ప్రొటోకాల్ పాటించేలా వారు చూడాలని గవర్నర్ సూచించారు.