దేశ వ్యాప్తంగా ఏడు నెలల తర్వాత థియేటర్ లు ఓపెన్ చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలతో అనుమతులు జారీ చేసిన విషయం తెలిసిందే.అక్టోబర్ 15 నుండి థియేటర్లు ఓపెన్ చేసుకోవచ్చు అంటూ కేంద్రం అధికారికంగా నోటీసులను కూడా అందించడం జరిగింది.
దాంతో దేశ వ్యాప్తంగా థియేటర్లు మరియు మల్టీప్లెక్స్ లను సుందరంగా తీర్చి దిద్దే పనిలో యాజమాన్యాలు ఉన్నాయి.భారీ ఎత్తున నష్టాలు వచ్చిన నేపథ్యంలో కాస్త టిక్కెట్ల రేట్లను పెంచుకోటానికి ఉద్దేశంతో థియేటర్ల యాజమాన్యాలు చర్చలు జరుపుతున్నట్లు గా కూడా వార్తలు వచ్చాయి.
టికెట్ల రేట్లు అటుంచి ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుండి థియేటర్ల ఓపెన్ కి సంబంధించి ఎటువంటి అనుమతులు రాలేదంటూ తెలుస్తోంది.ఇటీవలే ఏపీ ప్రభుత్వం వారు కేంద్ర ప్రభుత్వం విధించిన మార్గదర్శకాలను పాటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం విధించిన కండిషన్ లకు లోబడి థియేటర్లను ఓపెన్ చేసుకునేందుకు ఎలాంటి అభ్యంతరం లేదంటూ అధికారికంగా పేర్కొనడం జరిగింది.
ఏపీ ప్రభుత్వం నుండి వచ్చిన స్పష్టత తెలంగాణ ప్రభుత్వం నుండి ఇంకా రాకపోవడంతో తెలంగాణ థియేటర్ అసోసియేషన్ మండి పడుతోంది.ఇప్పటికే థియేటర్లు మూతపడి 7 నెలలు అవుతున్న నేపథ్యంలో భారీగా నష్టాలు వచ్చాయి.
థియేటర్ల విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఆదుకోవాల్సిన అవసరం ఉందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికైనా థియేటర్లకు సంబంధించి నిర్ణయం తీసుకోవాలంటూ విజ్ఞప్తి చేస్తున్నారు. అక్టోబర్ 15 నుండి హైదరాబాద్ మరియు తెలంగాణ ఇతర జిల్లాల్లో థియేటర్ల ఓపెన్ అవుతాయా లేదా అనేది మరో మూడు నాలుగు రోజుల్లో తెలిసే అవకాశం ఉంది. ఏపీతో పోల్చితే తెలంగాణలో కరోనా కేసులు తక్కువగానే ఉన్నాయి.
కనుక ఎలాంటి ఆందోళన లేకుండా థియేటర్లను ఓపెన్ చేసుకోవచ్చు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.మరి టీ ప్రభుత్వం అభిప్రాయం ఏంటో చూడాలి.