ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ నెల 20వ తేదీ నుంచి తుంగభద్ర పుష్కరాలు ప్రారంభమవుతున్న సంగతి తెలిసిందే.పుష్కరాల ప్రారంభానికి మూడు రోజులే ఉన్న నేపథ్యంలో తెలంగాణ సర్కార్ నేడు పుష్కరాలకు సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేసింది.
కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో ప్రభుత్వం భక్తులకు ప్రభుత్వం మార్గదర్శకాల్లో కీలక సూచనలు చేసింది.ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని పుష్కర ఘాట్లలో ఏర్పాట్లకు సంబంధించిన పనులు మొదలయ్యాయి. తెలంగాణ సర్కార్ పుష్కర ఘాట్ల దగ్గరకు భక్తులు కరోనా నెగిటివ్ రిపోర్ట్ తో రావాలని సూచనలు చేసింది.కరోనా రిపోర్ట్ లేని పక్షంగా థర్మల్ స్క్రీనింగ్ ద్వారా శరీర ఉష్ణోగ్రతను పరిశీలించి అధికారులు అనుమతి ఇవ్వనున్నారు.
ఎవరిలోనైనా కరోనా లక్షణాలు కనిపిస్తే వారిని పుష్కర ఘాట్లలోకి అనుమతించరు.ప్రభుత్వం 10 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న పిల్లలు, 65 సంవత్సరాల వయస్సు పై బడిన వృద్ధులు, గర్భిణీలు పుష్కరాలకు రావొద్దని సూచనలు చేసింది.
ఈ నెల 20న నుంచి వచ్చే నెల ఒకటో తేదీ వరకు పుష్కరాలు జరగనున్నాయి.ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు భక్తులకు పుష్కర ఘాట్లకు అనుమతులు ఇవ్వనున్నారు.పుష్కర ఘాట్ల దగ్గర మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం చేయాల్సి ఉంటుంది.ప్రభుత్వం ఘాట్ల దగ్గర, ఆలయాల దగ్గర శానిటైజర్లను ఏర్పాటు చేయనుంది.ప్రభుత్వం పుష్కర ఏర్పాట్ల కోసం రెండున్నర కోట్ల రూపాయలు విడుదల చేసింది.
మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి రెండు రోజుల క్రితం అధికారులతో సమీక్ష నిర్వహించారు.
మంత్రి మౌలిక వసతులు, ఏర్పాట్లకు సంబంధించి అధికారులకు కీలక సూచనలు చేశారు.భక్తులు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
పుష్కర ఘాట్ల దగ్గర కంచె ఏర్పాటు చేయాలని పిండ ప్రధానాలు, పూజలు చేసేవాళ్లు కరోనా నిబంధనలు పాటించాలని మంత్రి సూచించారు.