తెలంగాణలో శాసనసభ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం నోటిఫికేషన్ విడుదల చేసింది.మొత్తం 119 శాసనసభ నియోజకవర్గాలకు గానూ ఒకే విడతలో డిసెంబరు 7న పోలింగ్ నిర్వహించబోతున్నారు.
ముందుగా అనుకున్నట్టుగానే … షెడ్యూల్ ప్రకారం నోటిఫికేషన్ జారీ అయిన రోజు నుంచే అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయొచ్చు.నామినేషన్ల స్వీకరణకు 19 వరకు గడువు ఉంది.
అయితే, నామినేషన్ల ప్రక్రియ సోమవారం ఉదయం 11 గంటలకే ప్రారంభమైనా ఈ రోజు అంత మంచిది కాదు.ఉదయం 8 నుంచి 10 గంటల మధ్యే శుభ ఘడియలు ఉండటంతో అన్ని పార్టీల నేతలు ఈ రోజు నామినేషన్లను దాఖలు చేయలేని పరిస్థితి ఏర్పడింది.అలాగే సోమవారం సాయంత్రం నుంచి మంగళ వారం రోజంతా వర్జ్యం ఉంటుంది.కాబట్టి రేపు కూడా నామినేషన్ వేసే పరిస్థితి కనిపించడంలేదు.ఇక నవంబరు 15న అష్టమి కాబట్టి అంత మంచి తిథి కాదు.నవంబరు 16, 17 తేదిల్లో నవమి తిథి ఉన్నా సంఖ్యా పరంగా అంతగా కలిసిరాదని భావిస్తారు.
అందుకే ఈ తేదీల్లోనూ నామినేషన్లు దాఖలు చేయడానికి నేతలు ఇష్టపడరు.
ఇక నవంబరు 18 దశమి తిథి అయినా, ఆదివారం కావడం వల్ల నామినేషన్లు స్వీకరించరు.ఇక మిగిలింది కేవలం రెండు రోజులే.అవి నవంబరు 14, 19 మాత్రమే.
ఈ రెండు రోజుల్లో సప్తమి, ఏకాదశి తిథులు ఉండటమే కారణం.కాబట్టి, నవంబరు 14,19 తేదీల్లోనే నామినేషన్లు దాఖలు చేస్తే విజయం సిద్ధిస్తుందని పండితులు అంటున్నారు.
ముహూర్తాలు చూసుకుని ముందడుగు వేసే మన రాజకీయ నాయకులు, నామినేషన్ల సమయంలోనూ దాన్ని తప్పకుండా పాటిస్తారు.ఈసీ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం.
నామినేషన్ దాఖలకు ఏడు రోజులు గడువున్నా తిథి, శుభఘడియలు, వర్జ్యం, దుర్ముహూర్తంలు లాంటివి పరిగణనలోకి తీసుకుంటే ఆ రెండు రోజులు మాత్రమే మంచివని జ్యోతిషులు వ్యాఖ్యానిస్తున్నారు.