ఎంతో మంది ప్రవాస భారతీయులు ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో దేశాలలో స్థిరపడ్డారు.ఏడాదికి ఒకసారో సందర్భాను సారంగానో సొంత రాష్ట్రాలకు వెళ్ళే అవకాశం వస్తుంటుంది వారికి అప్పటి వరకూ సొంత ఊరిని కాని, సొంత మనుషులను కానీ చూసుకునే అవకాశమే ఉండదు.
ఇలాంటి పరిస్థితుల నేపధ్యంలోనే వారు విదేశాలలో ఉండే ప్రాంతాలలో వారి వారి సొంత ప్రాంతాల వారు ఎవరైనా ఉన్నారో లేదో చూసుకుని వారితో కలిసి ఓ సంఘాన్ని ఏర్పాటు చేసుకుంటారు.ఖాళీ సమయం దొరికినపుడు అందరూ కలుసుకుని భోజనం చేసి ఆట పాటలతో ఆ రోజు కాలం గడుపుతారు.
తాజాగా
సింగపూర్ లోని తెలంగాణా కల్చరల్ సొసైటీ ఇదే తరహాలో స్థానికంగా ఉన్న తెలంగాణా వాసులతో సింగపూర్ లోని లిటిల్ ఇండియాలో ఉన్న ద్వారకా రెస్టారెంట్ లో మీట్ అండ్ గ్రీట్ ను ఏర్పాటు చేసుకుంది.సుమారు 60 మందికి పైగా ఈ ఆత్మీయ సమావేశానికి విచ్చేశారు.
ఈ సమావేశంలో సొసైటీ సభ్యులు మాట్లాడుతూ గడిచిన ఏళ్ళుగా తమ సొసైటీ ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టిందని, సింగపూర్ లో ఉంటున్న తెలంగాణా వాసుల అభివృద్ధి కోసం ఎంతో కృషి చేసినట్టుగా తెలిపారు.ఒకే తాటిపై అందరూ ఉంటూ మన కష్ట సుఖాలలో భవిష్యత్తులో సైతం తోడుగా ఉండాలని పిలుపునిచ్చారు.
తెలంగాణా వాసులకు ఎంతో ప్రతిష్టాత్మకమైన బతుకమ్మ వేడుకలను ప్రతీ ఏటా ఎంతో వైభవంగా నిర్వహిస్తున్నామని ఈ ఏడాది కూడా ఈ వేడుకలను నిర్వహిస్తున్నట్టుగా తెలిపారు సొసైటీ సభ్యులు.గతంలో మాదిరిగానే ఈ సారి కూడా సంబవాంగ్ పార్క్ లో బతుకమ్మ వేడుకలను నిర్వహిస్తున్నట్టుగా ప్రకటించారు.
అందుకు సంభదించిన పోస్టర్, ప్రోమోలను సభ్యుల సమక్షంలో విడుదల చేశారు.బతుకమ్మ పండుగ కోసం సంస్థ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా పాటను రాయించి పాడించామని ఈ పాట ప్రతీ తెలంగాణా వాసుడికి నచ్చుతుందని తెలిపారు.