దాదాపు అందరూ సీనియర్లే ఉండడంతో ఎవరికి వారే ఎమునా తీరే అన్నట్లుగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకుల తీరు ఉన్నది.మొక్కుబడి ఉద్యమాలకు, సీజనల్ పోరాటాలకే నేతలు పరిమితమవుతున్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడినకాడినుంచి క్షేత్ర స్థాయిలో పార్టీ క్యాడర్ను, జనాన్ని సమీకరించి చేసిన ఉద్యమాలు చాలా తక్కువే.దాదాపు హైదరాబాద్ కేంద్రంగానే సమస్యల పోరాటానికి దృష్టి సారిస్తున్నారు తప్పితే చెప్పుకోదగ్గ ఉద్యమాలను అంతగా చేపట్టిన సందర్భాలు తక్కువే.
ఏదైనా ఒక సమస్యపై చివరి వరకు పోరాటం చేయకుండా దానిని మధ్యలోనే వదిలేస్తున్న పరిస్థితి ఉంది.సమస్య పరిష్కారం అవుతుందా లేదా? ఫలితం వస్తుందా లేదా? అని పక్కనబెట్టి క్షేత్రస్థాయిలో దానిని తీసుకెళ్లి ప్రజలకు వివరించే ప్రయత్నం చేయాలి.కానీ అలా చేయకుండా కాంగ్రెస్ నాయకులు కేవలం తమ ఉద్యమాలను దాదాపుగా హైదరాబాద్కే పరిమితం చేసుకుని రాత్రికి రాత్రే రాజకీయంగా మైలేజ్ సాధించుకోవాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.
ఎన్నికల సందర్భంలో తప్పితే ఇప్పటి వరకు ప్రజా వ్యతిరేక, రైతు, కార్మిక, ఉద్యోగ, నిరుద్యగం, విద్యార్థి సమస్యలపై రాష్ట్ర వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో నడుంబిగించిన దాఖలాల్లేవనే చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతోంది.
అందివచ్చిన అవకాశాలను చేజార్చుకుంటూ పార్టీ బలహీనపడే స్థాయికి చేరువవుతోందనే పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ప్రభుత్వం తీసుకునే ప్రజా వ్యతిరేక విధానాలను అస్త్రాలుగా చేసుకునే సత్తా, సమన్వయం లోపం పార్టీలో కొట్టొచ్చినట్లుగా కనబడుతుంది.
ఇదిలా ఉంటే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రాజెక్టుల బాట పట్టేందుకు సిద్ధమవుతున్నారు.కృష్ణానది, గోదావరి నదులపై నిర్మించతలపెట్టి మధ్యలోనే ఆగిపోయిన ప్రాజెక్టుల వద్ద నిరసనలు, దీక్షలు చేపట్టేందుకు కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు.
ఇందులో భాగంగానే కృష్ణనది, గోదావరి నదిపై ఉన్న పెండింగ్ ప్రాజెక్టుల వద్ద ముఖ్యనేతలు ఉత్తమ్ కుమార్రెడ్డి, భట్టివిక్రమార్క, రేవంత్రెడ్డి, కోండా విశ్వేశ్వర్రెడ్డి, జానారెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, వి.హనుమంత్రావు, ఇతర ముఖ్యనేతలు దీక్షల్లో పాల్గొనబోతున్నారు.
ఇప్పటి వరకు ఈ ప్రాజెక్టులు ఎందుకు పెండింగ్లో పెట్టారని ప్రభుత్వాన్ని నిలదీసేందుకు సన్నద్ధమవుతున్నారు.ఎవరు ఏ ప్రాజెక్టు వద్ద నిరసనలు తెలపాలో పిసిసి అధ్యక్షుడు ఇప్పటికే సమావేశంలో నిర్ణయించారు.అయితే తీసుకున్న ప్రాజెక్టుల అంశం బాగానే ఉంది.కానీ ఇందులో ఎంత వరకు కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందనేది పెద్ద ప్రశ్నే.అంటే రెండు జీవనదులపై పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులు, అవి వినియోగంలో రాకపోవడంతో కలిగే నష్టం రాష్ట్ర ప్రజలకు వివరించి వారి మద్దతును చూరగొనాలి.కానీ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో కొంత ఐక్యత కరువనే విషయం చర్చించుకుంటున్నారు.
ఎవరికి వారే ఎమునాతీరే అన్నట్లుగా నేతల తీరుంటుంది.ఈ ఉద్యమంలో ఎంత వరకు నాయకులు కలిసి పోరాడుతారనేది ఇంకా తెలియాల్సి ఉంది.
పార్టీ ఎజెండాలను పక్కన బెట్టి ఎవరికి వారు తమ సొంత ఎజెండాలతోనో పోతూంటరని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.కోమటి రెడ్డి బ్రదర్స్ ఒక దారైతే, రేవంత్ రెడ్డిది సపరేటు రూటు, ఇక ఉత్తమ్కుమార్రెడ్డి, జానారెడ్డి, భట్టి ఇలా ఎవరికి వారూ తమ సొంత కార్యాచరణ ఉందనే చర్చ పార్టీ కార్యకర్తల్లో జోరుగానే సాగుతోంది.
పార్టీ నాయకుల్లో సఖ్యత, ఐక్యత, సమన్వయం లేకుంటే ప్రజా సమస్యలపై ఎన్ని పోరాటాలు జరిపిన జనం నుంచి మద్దతు కాదు కదా…సొంత పార్టీ కార్యకర్తల నుంచి కూడా మద్దతు రాదు.ఎందుకంటే గతంలో చాలా ప్రజా సమస్యలపై కాంగ్రెస్ పార్టీ నిరసనలు తెలిపింది.
సమిష్టిగా నాయకులందరూ కలిసి పోరాటం చేసి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి సమస్య పరిష్కారానికి కలిసి పోరాటం చేయకుండా ఎవరికి వారూ అన్నట్లుగా వ్యవహరించే వారు.ప్రభుత్వం తీసుకునే ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడి ప్రజా మద్దతు తెలుపుకొని అటు పార్టీ కార్యకర్తలకు ఇటు ప్రజలకు మేము ఉన్నామనే భరోసాను కల్పించకుండా విఫలమవుతున్నరని పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
కష్టాల్లో ఉండే సెకెండ్ క్యాడర్ నేతలకు, పార్టీ కార్యకర్తలకు సొంత పార్టీ నేతల నుంచి భరోసా లేదని నాయకులు వాపోతున్నారు. ప్రజా సమస్యలను భుజాన ఎత్తుకొని వాటిని తీరం దాక తీసుకెళ్లకుండానే నడి సంద్రంలో వదిలేస్తున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఉదాహరణకు ఇంటర్మీడియెట్ ఇష్యూ, ఆర్టిసి సమ్మె, పోతిరెడ్డిపాడు కృష్ణా జలాల విషయం, అలాగే రైతులు ఏ పంట వేయాలో ప్రభుత్వమే నిర్ణయించడం.చెప్పిన పంట వెస్తేనే రైతు బంధు వర్తిస్తుందనడం లాంటి వాటిపై పోరాటాలు చేసి పెద్దగా ప్రజా మద్దతు మూటగట్టుకున్న పరిస్థితి అంతగా లేదు. ఏ సమస్యలపై చివరి వరకు పోరాడకుండానే ఫలితం ఆశించే విధానం కాంగ్రెస్ పార్టీ కొంత మంది నేతలకు ఉందనే అభిప్రాయం సామాన్యకార్యకర్తల్లో ఉంది.గతంలో సిఎల్పి, పిసిసి నేతలు కలిసి ముందు ఉండి అందర్ని కలుపుకొని గ్రౌండ్లెవల్ వరకు పోయి ప్రజాబలం మూటగట్టుకునే వారు.
దానికి బిన్నంగా ప్రస్తుత నాయకుల పరిస్థతి ఉన్నట్లుగా కనబడుతోంది.
చేజార్చుకున్న అవకాశాలు……….
ఒక సారీ గతంలో జరిగిన సంఘటనలు పరిశీలిస్తే చరిత్రలో ఎన్నడూ లేనంతగా ఆర్టిసి కార్మికులు తమ హక్కుల కోసం నిర్విరామంగా 50 రోజులకు పైగా సమ్మె చేపట్టారు.ఇందులో కొంత మంది ఆర్టిసి డ్రైవర్లు, కండక్టర్లు ఆత్మ బలిదానాలు కూడా చేసుకున్నారు.
మరి ఇంత పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతే ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ తన స్థాయికి తగినట్లుగా పాత్ర పోషించలేదనే అప్పట్లో చర్చ జరిగింది.వేడి నీళ్లకు చన్నీళ్లు తోడన్నట్లుగా కార్మికులకు అండగా నిలిచి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి డిమాండ్ల సాధనలో భాగస్వామ్యం కాకుండా కొంత స్థాయి వరకే రిమితమైందనే అపవాదను మూటగట్టుకుంది.
ప్రారంభంలో బిజెపి కాస్త ముందుండి పోరాడినా ఆ తరువాత బిజెపి కూడా కాస్త సల్లబడింది.కేవలం ఆర్టిసి యూనియన్ నాయకులు, కార్మికులు మాత్రమే ఉద్యమాన్ని ఓ స్థాయికి తీసుకెళ్లారు.
వారి శక్తికి మించి పోరాటం చేశారు.కానీ విజయం సాధించలేకపోయారు.
అడపాదడపా మినహా తమ తమ ఇళ్లకే పరిమితమై ప్రెస్మీట్లు, ప్రెస్ నోట్ల విడుదలకే కాంగ్రెస్ నాయకులు పరిమితమయ్యారనే చర్చ అప్పట్లో బాగా జరిగింది.జిల్లాల వారీగా క్యాడర్ను సమీకరించి పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిపిన దాఖలాలు లేవు.
అలాగే గతంలో ఇంటర్మీడియట్ వాల్యూయేషన్లో జరిగిన తప్పిదంపైన కూడా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు విద్యార్థులు, వారి తల్లి దండ్రుల పక్షాన ఆశించిన స్థాయిలో నిలబడలేదనే అపవాదు ఉంది.పోతిరెడ్డిపాడు విషయానికొస్తే ఈ ప్రాజెక్టు నిర్మాణంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం పాత్ర ఎంతో కొంత ఉంది.
కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ కావడం, రెండు రాష్ట్రాల్లో అక్కడ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ శాఖలు ఉండడం కాంగ్రెస్ పార్టికి మైనస్ అయ్యే అవకాశం.
ఎందుకంటే….పోతిరెడ్డి పాడు వల్ల దక్షిణ తెలంగాణకు అన్యాయం జరుగుతుందనేది ఇక్కడి కాంగ్రెస్ నాయకుల వాదన.మరీ ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ రెండు చోట్ల ఏ విధంగా సమర్థించుకుంటుంది.
ఎటొచ్చి పోతిరెడ్డి పాడు వల్ల అక్కడ, ఇక్కడ రాజకీయంగా లాభపడేది వైసిపి, టిఆర్ఎస్ పార్టీలే.ఈ రెండు పార్టీలు కలిసి ప్రజల దృష్టిలో శత్రువులను చేసేది కాంగ్రెస్ పార్టినినే.
ఇదిలా ఉంటే ప్రస్తుతం కాంగ్రెస్ నాయకులు నూతన ఎజెండాతో ప్రాజెక్టుల బాట పట్టేందుకు కార్యచరణ రూపొందించుకున్నారు.అసంపూర్తిగా కృష్ణా నది, గోదావరి నదులపై ఉన్న పెండింగ్ ప్రాజెక్టుల వద్ద దీక్షలు చేపట్టబోతున్నట్లు ప్రకటించారు.
ఈ కార్యక్రమాన్ని ఎంత వరకు అములు చేస్తారు…లేదా మొక్కుబడిలాగానే దీనిని కూడా మమా అని పిస్తారా అనేది వేచి చూడాలి మరీ.