తెలంగాణ కాంగ్రెస్ కు ప్రధాన శత్రువులు ఎవరూ అంటే అది ఖచ్చితంగా టిఆర్ఎస్, ఆ పార్టీ అధినేత కేసీఆర్.కానీ ఆ విషయం పక్కన పెట్టి తమకు ప్రధాన శత్రువు , తమ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అనే విధంగా తెలంగాణ కాంగ్రెస్ సీనియర్లు చాలామంది అభిప్రాయపడుతూ ఉండడమే తెలంగాణ కాంగ్రెస్ కు ప్రధాన ఆటంకం గా మారింది.
ప్రతి విషయంలోనూ రేవంత్ తీసుకున్న నిర్ణయాన్ని తప్పు పట్టడం, లేదా పార్టీకి నష్టం జరిగే విధంగా విమర్శలు చేయడం వంటివి సర్వసాధారణంగా మారిపోయాయి.ప్రత్యేక తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ కు ఒక మంచి గుర్తింపు ఉన్నా, దానిని ఓట్ల రూపంలో మలుచుకోవడంలో ఆ పార్టీ విఫలమైందనే చెప్పాలి.
తెలంగాణ ఆవిర్భావం తర్వాత జరిగిన రెండు ఎన్నికల్లోనూ కాంగ్రెస్ ఘోర పరాజయం పాలైంది.ఆ సంగతిని పక్కన పెడితే కాంగ్రెస్ సీనియర్లు గ్రూపు రాజకీయాలకు పాల్పడుతూ ఉండడం వంటివి ఇబ్బందికరంగా మారాయి.
తాజాగా తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విషయంలో సీనియర్లు ఇదే వైఖరితో వ్యవహరిస్తున్నారు.
రేవంత్ తీసుకొన్న నిర్ణయాన్ని తప్పు పడుతూ, ఆయన ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు.
ఇప్పటికే కాంగ్రెస్ సీనియర్ నేత సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి తీవ్రంగా రేవంత్ రెడ్డి పై మండిపడ్డారు.ఆయన ఒక్కడే హీరో అనుకుంటే ఎలా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్ సీనియర్లు ఎక్కువ శాతం మంది రేవంత్ నాయకత్వం ను ఇప్పటికీ ఒప్పుకునే పరిస్థితుల్లో లేరు.కేవలం కొంతమంది రేవంత్ వర్గంగా గా ముద్రపడిన నాయకులే ఆయనకు మద్దతు పలుకుతూ వస్తున్నారు.
కొద్ది రోజుల క్రితం నిర్వహించిన దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరా కార్యక్రమం అనుకున్న మేర సక్సెస్ అయినా, సీనియర్లు మాత్రం ఈ సభ పై విమర్శలు వ్యక్తం చేస్తున్నారు.ముఖ్యంగా ఈ ఇంద్రవెల్లి సభకు రేవంత్ వర్గంగా ముద్రపడిన ములుగు ఎమ్మెల్యే సీతక్క అధ్యక్షత వహించడం, గజ్వేల్ సభ కు రేవంత్ వర్గంలోని నాయకులు సభ నిర్వహణలో చురుగ్గా పాల్గొనడం వంటివి సీనియర్లకు మరింత ఆగ్రహాన్ని కలిగించాయి.
గజ్వేల్ సభలో రేవంత్ రెడ్డి రెండు నెలలపాటు నిరుద్యోగ సమస్యపై కార్యాచరణ ప్రకటించారు.అయితే ఈ విషయాలు తమతో చర్చించకుండా ఏకపక్షంగా ప్రకటించారని, అధికార ప్రతినిధుల పేర్లు ప్రకటించిన సమయంలోనూ తమతో ఏ విషయం చెప్పలేదు అని, అలాగే గాంధీ భవన్ నిర్వహించిన అఖిలపక్ష సమావేశానికి తమకు ఆహ్వానాలు పంపలేదు అని, ఇలా రకరకాల కారణాలతో రేవంత్ ను ఇరుకున పెట్టే ప్రయత్నం చేయడంతో పాటు, అధిష్టానానికి ఫిర్యాదులు చేస్తున్నారు.అయితే సీనియర్ ల వ్యవహారశైలిని రేవంత్ వర్గం తప్పు పడుతోంది.ఎప్పుడు ఇదే గ్రూప్ రాజకీయాలతో వ్యవహరించడం కారణంగా , పార్టీ రెండు సార్లు అధికారంలోకి రాలేక పోయిందని, ఆయన తీరు మార్చుకోకపోతే ఎలా అంటూ వారు ప్రశ్నిస్తున్నారు.
ఇక అధిష్టానం కూడా రేవంత్ కు పూర్తిగా మద్దతు పలుకుతున్నట్లు వ్యవహరిస్తోంది.అయినా సీనియర్లు మాత్రం రేవంత్ విషయంలో తమ వైఖరి ఇదే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.ఈ నేపథ్యంలోనే ఈరోజు జరగబోయే పీఏసీ భేటీకి ఎవరెవరు వస్తారు ? ఏయే అంశాలపై స్పందిస్తారు అనేది ఆసక్తికరంగా మారింది.