మొన్న జరిగిన తెలంగాణ ఎన్నికల్లో చతికిలిపడ్డ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఆ పరాభవం నుంచి ఇంకా తేరుకోలేకపోతోంది.ఎన్నికల ముందువరకు కాంగ్రెస్ పార్టీ తరపున టికెట్ మాకంటే మాకు అంటూ గొడవలకు దిగిన ఆ పార్టీ నాయకులు ఇప్పుడు జరగబోయే ఎన్నికల్లో ఎంపీ సీటు ఇస్తామంటే మాత్రం అయ్యబాబోయ్ మాకొద్దు అంటూ… మొఖం చాటేస్తున్నారు.
అప్పట్లో ఎమ్యెల్యేలు గా అవకాశం దక్కని వారు ఎంపీగా అవకాశం ఇవ్వాలంటూ… షరతులు కూడా అప్పట్లో విధించారు.అయితే ఇప్పుడు పిలిచి మరీ టికెట్ మీకే అని ప్రకటించినా ఎవరూ ధైర్యంగా ముందుకు వెళ్లలేని పరిస్థితి తలెత్తింది. కొద్ది రోజుల క్రితం … ఢిల్లీలో రాహుల్గాంధీ.సీనియర్ నేతలు, ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు.ఈ మీటింగ్ తర్వాత చాలా మంది సీనియర్ నేతలు ఎంపీగా పోటీ చేసేందుకు రెడీగా లేరని తెలుస్తోంది.
ఎమ్మెల్యే ఎన్నికల్లో ఆర్దికంగా నష్టపోయిన వారు ఎంపీగా పోటీ చేస్తే కొంత మేరకు హైకమాండ్ ఇచ్చే నిధులతో సర్దుకోవచ్చని ఆశించారు.కొందరు ఎంపీగానైనా గెలుస్తామని ఆశించారు.కానీ హైకమాండ్ నుంచి ఆర్దికపరమైన హామీ లభించకపోవడంతో పోటీ అంటేనే వెనక్కి వెళ్లే పరిస్థితి తలెత్తింది.
మరోవైపు నల్గొండ నుంచి కోమటిరెడ్డి వెంకట రెడ్డి మాత్రం ఎంపీగా పోటీ చేసేందుకు ధైర్యంగా ముందుకు వెళ్తున్నారు.మొన్నటిదాకా డీకే అరుణ,రేవంత్ రెడ్డి, దామోదర రాజనర్సింహ తో పాటు చాలా మంది నేతలు ఎంపీగా పోటీ చేసేందుకు ఉత్సాహపడ్డారు.
అయితే ఇప్పుడు పరిస్థితి బాగోలేకపోవడంతో వెనక్కి తగ్గుతున్నారు.
మెదక్, నిజామాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, వరంగల్, ఆదిలాబాద్, భువనగిరి, ఖమ్మం,మల్కాజిగిరి నుంచి కాంగ్రెస్ తరపున ఎవరు పోటీ చేస్తారనేది ఇంకా తేలడం లేదు.ఇక్కడ పాత నేతలు పోటీ చేసేందుకు ఇష్టంగా లేరు.మరోవైపు కాంగ్రెస్లో ఎంపీ సీట్లు గెలవాలనే తాపత్రాయం కూడా కనపడడం లేదు.
దీంతో కొత్త అభ్యర్థుల వేటలో కాంగ్రెస్ పడింది.రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసేందుకు ఆసక్తి ఉన్న అభ్యర్థులు 10వ తేదీ నుంచి దరఖాస్తులు చేసుకోవాలని టిపిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పటికే ప్రకటన కూడా విడుదల చేశారు.
అయితే దీనికి ఆసనించిన స్థాయిలో స్పందన ఉండే అవకాశం అయితే కనిపించడంలేదు.