ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ లో పిసిసి అధ్యక్ష పదవిపై పెద్ద తతంగమే జరుగుతోంది.ఈ పదవి ఎవరిని వరిస్తుందో ఇంకా స్పష్టమైన క్లారిటీ లేకపోయినప్పటికీ ఎక్కువగానే హడావుడి నడుస్తూ వస్తోంది.
రెండు మూడు రోజుల్లోనే ఈ వ్యవహారానికి సంబంధించి ఉత్కంఠకు తెరదించుతూ తెలంగాణ పీసీసీ అధ్యక్షుడి పేరు ప్రకటించేందుకు అధిష్టానం కసరత్తు చేస్తోంది.ఇప్పటికే రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మల్లు భట్టి విక్రమార్క, ఇలా చాలామంది నేతల ఆశలు పెట్టుకున్నారు.
ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ లో ఈ వ్యవహారంపై ఎక్కువ చర్చ జరుగుతోంది.ఈ వ్యవహారం ఇలా ఉండగానే అకస్మాత్తుగా కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలను అకస్మాత్తుగా ఢిల్లీకి బయలుదేరి రావాలంటూ సమాచారం ఇచ్చింది.
దీంతో కాంగ్రెస్ ఎంపీలంతా ఢిల్లీ బాట పట్టారు.దీనిపై రాజకీయ వర్గాల్లో మరింతగా కంగారు పెరిగిపోయింది.
పిసిసి అధ్యక్షుడి ఎంపిక కోసమే ఉన్నట్టు ఉండి ఎంపీలను ఢిల్లీ కి పిలిపించినట్లు ప్రచారం జరిగింది.అయితే దీనిపై సరైన క్లారిటీ లేకపోవడంతో రకరకాల ఊహాగానాలు వస్తుండడంతో, ఎంపీల పర్యటనపై ఆరా తీయగా అసలు విషయం బయటపడింది.
ఎంపీలను ఢిల్లీకి పిలిపించడానికి పిసిసి అధ్యక్ష పదవికి సంబంధమే లేదని, రైతులకు మద్దతుగా నిర్వహిస్తున్న ఆందోళనలకు మద్దతు తెలిపేందుకు మాత్రమే ఎంపిలను అధిష్టానం పిలిపించినట్టు తెలుస్తోంది.కేంద్రం కొత్త గా తీసుకొచ్చిన వ్యవసాయ సంస్కరణల బిల్లుకు వ్యతిరేకంగా ఢిల్లీలో పెద్దఎత్తున రైతులు పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే.
ఈ ఆందోళన కార్యక్రమాల్లో ఎక్కువగా పంజాబ్ హర్యానా కు చెందిన రైతులు పాల్గొన్నారు.ఈ రైతు ఉద్యమానికి కాంగ్రెస్ సైతం మద్దతు పలికింది.
ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద పంజాబ్, హర్యానా కు చెందిన కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు, ముఖ్య నాయకులు ఆందోళన నిర్వహిస్తున్నారు.ఈ ఆందోళన కార్యక్రమాలకు రాహుల్ గాంధీ సైతం మద్దతుగా వారికి సంఘీభావం ప్రకటించారు.ఈ నేపథ్యంలోనే రాహుల్ నేతృత్వంలోని కాంగ్రెస్ ఎంపీలు ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద నుంచి రాష్ట్రపతి భవన్ వరకు పాదయాత్రగా వెళ్లి రామ్ నాథ్ కోవింద్ కు వినతిపత్రం ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు.అందుకే ఢిల్లీకి హుటాహుటిన వెళ్లినట్టు తెలుస్తోంది.