తెలంగాణ కాంగ్రెస్ ను సరికొత్తగా పరుగులు పెట్టించేందుకే ఆ పార్టీ రాష్ట్ర నేతలంతా నిర్ణయం తీసుకున్నారు.గతంలో ఎప్పుడూ లేనివిధంగా నేతలంతా ఒకే విషయంపై ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు.
గతంతో పోలిస్తే తెలంగాణ కాంగ్రెస్ కు ఆదరణ పెరిగింది అని, జనాలకు టిఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ కనిపిస్తోందని నాయకులు బలంగా నమ్ముతున్నారు.అందుకే మొన్నటి వరకు పెద్దగా యాక్టివ్ గా కనిపించని నేతలంతా ఇప్పుడు మంచి హుషారుగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ, తమ వంతు సహాయ సహకారాలు అందిస్తున్నారు.
ముఖ్యంగా తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తరువాత పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు చేపట్టిన ప్రక్షాళన కార్యక్రమం మరింత ఉత్సాహాన్ని కలిగిస్తోంది.
ఇటీవల హుజూరాబాద్ కీలక నాయకుడు కౌశిక్ రెడ్డి ని టిఆర్ఎస్ కోవర్టుగా అనుమానించి బయటకు వెళ్లేలా రేవంత్ చేశారు.
అదేవిధంగా పార్టీలో ఉన్న కోవర్టులు విషయంలో కఠినంగా వ్యవహరించాలని తాజాగా జరిగిన టిపిసిసి రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.కోవర్టుల విషయంలో ఆలస్యం చేయకూడదని, తక్షణమే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.
పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అధ్యక్షతన జూమ్ యాప్ ద్వారా జరిగిన ఈ సమావేశంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఏఐసిసి ఇన్ఛార్జి కార్యదర్శులు శ్రీనివాస కృష్ణన్, బోస్ రాజు, వర్కింగ్ ప్రెసిడెంట్ లు గీతా రెడ్డి ,జగ్గారెడ్డి, మహేష్ కుమార్ గౌడ్, ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కిగౌడ్, కార్యక్రమాల నిర్వహణ కమిటీ చైర్మన్ ఏలేటి మహేశ్వర రెడ్డి, ప్రచార కమిటీ కన్వీనర్ అజ్మతుల్లా హుస్సేన్ తదితర నేతలంతా ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ ను తెలంగాణలో అధికారంలోకి తెచ్చే విషయమై చర్చించారు.అలాగే టీఆర్ఎస్ పార్టీ దూకుడును ఎదుర్కొనేందుకు రాబోయే రోజుల్లో ఏం చేయాలనే విషయంపైనా చర్చించారు.పార్టీలో కోవర్టులు అంశాన్ని నిరంజన్ లేవనెత్తగా, ఇక కోవర్టుల విషయంలో ఆలస్యం చేయకూడదని, వెంటనే వారిని ఏరి పారేయాలి అని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.
ఇప్పటి వరకూ ఎలా ఉన్నా, ఇకపై పార్టీ నాయకులు అందరినీ కలుపుకొని ముందుకు వెళ్లాలని, హుజురాబాద్ లో కాంగ్రెస్ అభ్యర్థిని త్వరగా ఎంపిక చేసి, అక్కడ పార్టీ విజయం సాధించేలా చేయగలిగితే రాబోయే రోజుల్లో తెలంగాణలో కాంగ్రెస్ కు అధికారం దక్కడం ఖాయమనే అభిప్రాయం సమావేశంలో పాల్గొన్న నేతలంతా చేశారు.