ఏపీ అధికార పార్టీ వైసీపీ, తెలంగాణ అధికార పార్టీ టీఆర్ఎస్ మధ్య స్నేహం కొనసాగుతోంది.ఒకరికి ఒకరు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించుకుంటూనే రెండు రాష్ట్రాల మధ్య సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకుందామని ఆలోచనలో ఉన్నారు.
ఇంతవరకు బాగానే ఉన్నా కొత్తగా ఏపీలో సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన వైసీపీ అధినేత జగన్ ఆ తరువాత నుంచి తీసుకుంటున్న నిర్ణయాలు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను ఇబ్బంది పెడుతున్నాయి.జగన్ ఇక్కడ అనుసరిస్తున్న రాజకీయ నియమాలు కేసీఆర్ ను బాగా ఇరకాటంలో నెట్టేస్తున్నాయి.
ముఖ్యంగా పార్టీ ఫిరాయింపుల విషయంలో జగన్ విలువలు పఠిస్తుండడంతో అందరి వేళ్లు కేసీఆర్ వైపే చూపిస్తున్నాయి.వైసీపీలోకి చాలామంది టీడీపీ ఎమ్యెల్యేలు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని, అయితే నేను చంద్రబాబు లా విలువలు పాటించకుండా వారిని చేర్చుకొనని, పార్టీలోకి రావాలనుకున్న వారు తమ పదవులకు రాజీనామా చేసి రావాలని జగన్ పిలుపునిస్తున్నారు.
అయితే తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ ఎమ్యెల్యేలను చేర్చుకునే విషయంలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈ విలువలు ఎక్కడా పాటించడంలేదు.దీంతో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కొత్త పల్లవి అదనుకుంది.కేసీఆర్ గారు ఏపీలో మీ మిత్రుడు జగన్ ఏ విధంగా విలువలు పాటిస్తున్నాడో చుడండి .మీరు అలా ఎందుకు చేయలేకపోతున్నారు అంటూ కేసీఆర్ పై విమర్శల వర్షం కురిపిస్తున్నారు.ఈ అంశం కేసీఆర్ కు ఇబ్బందికరంగా మారింది.టీఆర్ఎస్ ఇప్పటికే పెద్ద ఎత్తున కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను చేర్చుకుంది.అటు మండలి లెజిస్లేచర్ పార్టీని, ఇటు శాసనసభ లెజిస్లేచర్ పార్టీని వేర్వేరుగా విలీనం చేసుకుని కాంగ్రెస్ పార్టీ లేదని తీర్మానించేశారు.
దీనిపై కాంగ్రెస్ నేతలు గట్టిగానే పోరాటం చేస్తున్నారు.
దీనిని టీఆర్ఎస్ నాయకులు తిప్పి కొడుతున్నారు.ఈ క్రమంలో.
ఏపీలో తమ మిత్రుడు జగన్ చేస్తున్న వ్యాఖ్యలు టీఆర్ఎస్ కు ఇబ్బందికరంగా మారాయి.ఫిరాయింపులకు తాను కొన్నిప్రమాణాలు పెట్టుకున్నానని, అవి చేయకపోతే రాజకీయ వ్యవస్థను భ్రష్టు పట్టించినట్లేనని భారీ డైలాగులు చెబుతున్నాడు జగన్.
ఈ మాటలన్నీ టీఆర్ఎస్ నాయకులకు ఎక్కడో గుచ్చుకుంటున్నాయి.కాంగ్రెస్ పార్టీ కూడా జగన్ వ్యాఖ్యలను హైలెట్ చేస్తూ చిన్నవాడైన జగన్ ను చూసి మీరందరూ నేర్చుకోవాలి అంటూ టీఆర్ఎస్ నాయకులకు సూచిస్తున్నారు.
జగన్ మీద టీఆర్ఎస్ నాయకులకు ప్రేమ లేకపోయినా జగన్ చెబుతున్న మాటలు మాత్రం టి.కాంగ్రెస్ నాయకులకు పెద్ద ఊరడింపుగా ఉన్నాయి.