దేశవ్యాప్తంగా బిజెపి పై ప్రజా వ్యతిరేకత పెరిగిపోతోంది.ధరల పెరుగుదలతో పాటు ఎన్నో అంశాలు బీజేపీపై ప్రతికూలత పెరగడానికి కారణం అవుతోంది.
వరుసగా జరుగుతున్న అన్ని ఎన్నికల్లోనూ బీజేపీకి పరాభవమే ఎదురవుతూ వస్తోంది.బీజేపీపై జనాల్లో పెరుగుతున్న ఈ వ్యతిరేకత తమకు అనుకూలంగా మార్చుకోవడం లో కాంగ్రెస్ జాతీయ స్థాయిలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది.
ఏ ఎన్నికల్లోనూ ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయింది .అయితే బిజెపి లేకపోతే ప్రాంతీయ పార్టీల హవా నడుస్తూ ఉండటం తో, మరోసారి ఎన్నికలు జరిగితే బీజేపీకి కానీ , ప్రాంతీయ పార్టీల కూటమి కానీ అధికారంలోకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి తప్ప , కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందనే సంకేతాలు మాత్రం పెద్దగా కనిపించడం లేదు.
ఇదిలా ఉంటే తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి రోజురోజుకు దిగజారుతున్నట్లుగా కనిపిస్తోంది.అక్కడ అధికారంలోకి వచ్చే అవకాశం లేదు అన్నట్టుగా కాంగ్రెస్ నాయకుల వ్యవహారశైలి ఉంటోంది.అసలు తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ కు ఇప్పటివరకు తెలంగాణ ప్రజల్లో గుర్తింపు లేదు.తెలంగాణ ఏర్పడిన తర్వాత జరిగిన రెండు ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ గెలిచింది.
బలమైన పునాదులు ఉండి , క్షేత్రస్థాయి నుంచి పెద్దఎత్తున కార్యకర్తలు, నాయకుల బలం కాంగ్రెస్ పార్టీకి ఉన్నా, దానిని ఓట్ల రూపంలోకి మార్చుకోవడంలో కాంగ్రెస్ విఫలమవుతూ వస్తుంది.ఎప్పటి నుంచో తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు మారుతారని వార్తలు వస్తున్నా , అది మాత్రం కార్యరూపం దాల్చడం లేదు.
అప్పుడు ఇప్పుడు అంటూ ఏదో ఒక సాకు చూపించి వాయిదా వేసుకుంటూ వస్తున్నారు.పీసీసీ చీఫ్ గా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి పేరు అధిష్టానం ఎప్పటి నుంచో పరిశీలిస్తూనే వస్తున్న, సీనియర్ల అభ్యంతరాలతో ధైర్యంగా ఆయన పేరును ప్రకటించలేకపోతుంది.జీవన్ రెడ్డి , కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీధర్ బాబు, మల్లు భట్టి విక్రమార్క ఇలా ఎంతోమంది రేసులో ఉన్నారు .ఎవరు చేయలేని స్థితిలో కాంగ్రెస్ అధిష్టానం నాన్చుడు ధోరణితో వ్యవహరిస్తు వస్తుండడంతో, కాంగ్రెస్ పరిస్థితి మరింతగా తెలంగాణ లో దిగజారుతోంది .పోనీ పదవులతో సంబంధం లేకుండా , పార్టీని నాయకులు ముందుకు తీసుకువెళ్తున్న పరిస్థితి లేకపోవడంతో కాంగ్రెస్ మరింత కష్టాల్లో మునిగిపోతుంది.ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ కు గత వైనవం అనేది కలగానే కనిపిస్తోంది.