ఏపీ సీఎం జగన్ తెలంగాణ సీఎం కేసీఆర్ ఇద్దరు మంచి మిత్రుకు అనే సంగతి తెలిసిందే.ఒకరికొకరు అన్ని విషయాల్లో సహకరించుకుంటూ, రాజకీయంగా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని వ్యవహారాలు చక్కబెట్టుకుంటూ వస్తున్నారు.2019 ఎన్నికల సమయంలో వైసిపి విజయానికి , జగన్ ను ముఖ్యమంత్రి చేసి తీరాలనే కసితో కేసీఆర్ గట్టిగానే వ్యూహాలు రూపొందించారు.ఆర్థికంగా, వ్యూహాలపరంగా , అన్ని విధాలుగా జగన్ కు సహాయ సహకారాలు అందించారు.
కెసిఆర్ భావించినట్లు గానే తిరుగులేని మెజారిటీతో జగన్ అధికారంలోకి వచ్చారు.ఇదంతా జగన్ పై అభిమానం మాత్రమే కాకుండా, తమ రాజకీయ శత్రువు అయిన టీడీపీ అధినేత చంద్రబాబును ఇరుకున పెట్టడమే వ్యూహంగా కెసిఆర్ పావులు కదిపారు .రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు గా కేసీఆర్ జగన్ ఇద్దరు పరిపాలనా వ్యవహారాల్లో ఒకరికొకరు సహకరించుకుంటూ వచ్చారు.
విభజన సమస్యలు దగ్గర నుంచి, అన్ని విషయాల్లోనూ ఒకరికొకరు ఎటువంటి విభేదాలు లేకుండా సహాయ సహకారాలు అందించుకుంటూ వచ్చారు.
ఒకవైపు తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రజాకర్షక పథకాలతో జనాల్లో దూసుకుపోతూ వచ్చారు.రెండోసారి టిఆర్ఎస్ తెలంగాణ లో గెలిచిన దగ్గర నుంచి కేసీఆర్ శరవేగంగా రాజకీయ అడుగులు వేసుకుంటూ వచ్చారు.
ఇక కెసిఆర్ మిత్రుని గా జగన్ సైతం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ప్రజాకర్షక పథకాలే ఏకైక లక్ష్యంగా అమలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు.జనాలలోనూ మంచి పలుకుబడి సంపాదిస్తూ, రాజకీయంగా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకుంటూ, పెద్ద ఎత్తున పథకాలకు రూపకల్పన చేస్తూ , తిరుగులేని విధంగా చేసుకుంటూ వస్తున్నారు.
దీంతో జగన్ పేరు దేశవ్యాప్తంగా మారుమోగుతూ వస్తోంది .
గతంలో కేసిఆర్ పేరు ఇదేవిధంగా వినిపించగా, ఇప్పుడు ఎక్కడా ఆయన పేరు వినిపించడం లేదు. కేవలం జగన్ పేరు మాత్రమే ఎక్కువగా హైలెట్ అవుతూ ఉండడం వంటివి కెసిఆర్ కు ఇప్పుడు ఇబ్బందికరంగా మారాయి.తెలంగాణలో టిఆర్ఎస్ రాజకీయ ప్రత్యర్థులు అంతా జగన్ పరిపాలన తో కేసిఆర్ పరిపాలన పోల్చి చూస్తూ , పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ ఉండడం ఇప్పుడు కేసీఆర్ కు ఇబ్బందికరంగా మారింది.
జగన్ ఏపీలో అమలు చేస్తున్న పథకాలను తెలంగాణలో నూ అమలు చేయాలనే డిమాండ్ రోజురోజుకు పెరుగుతూ వస్తోంది.ముఖ్యంగా పేద రైతులకు ఉచితంగా ప్రభుత్వమే బోర్లు వేస్తుండటం తో తెలంగాణలో ఉచిత బోర్ల పథకాన్ని అమలు చేయాలనే డిమాండ్ రైతుల నుంచి ప్రతిపక్షాల నుంచి ఎదురవుతోంది.
అలాగే వాలంటీర్ల వ్యవస్థతోపాటు, రేషన్ సరుకులు నేరుగా లబ్ధిదారుల ఇంటికి తీసుకొచ్చి అందించే ఏర్పాటు చేయడం పైన తెలంగాణలో చర్చ జరుగుతోంది.ఆర్థికంగా తెలంగాణ ఏపీకంటే బలంగా ఉన్నా, కేసీఆర్ చొరవ చూపించడం లేదు అనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.