ఎట్టకేలకు తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు కేసీఆర్ ముహూర్తం ఖరారు చేశాడు.చాలాకాలంగా మంత్రివర్గ విస్తరణపై అనేక ఊహాగానాలు వస్తూనే ఉన్నాయి.
అయినా కేసీఆర్ ఈ విషయంపై ఎక్కడా స్పందించకుండా వ్యూహాత్మక మౌనం వహిస్తూ వచ్చారు.ఇక మంత్రి వర్గ విస్తరణలో ఎవరికి చోటు దక్కుతుంది, ఎవరిని ఇంటికి పంపుతారు అనే విషయం ఇప్పుడు హాట్ టాఫిక్ గా మారింది.
ఆదివారం (సెప్టెంబర్ 8,2019) సాయంత్రం 4 గంటలకు రాజ్భవన్లో కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.మంత్రివర్గంలో ఆరు ఖాళీలు ఉండడంతో మొత్తం ఖాళీలన్నీ ఇప్పుడే భర్తీ చేస్తారా లేదా అన్న టెన్షన్ అందరిలోనూ నెలకొంది.
ప్రస్తుతం కేబినెట్లో ఉన్న పలువురు మంత్రులకు ఉద్వాసన తప్పదన్న ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతోంది.ఇక ఈ రోజు చేపట్టబోయే మంత్రివర్గ విస్తరణకు సంబంధించి సీఎం ఆదేశాలతో రాజ్భవన్లో కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారానికి ప్రభుత్వ వర్గాలు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు.
తెలంగాణకు కొత్త గవర్నర్గా నియమితులైన తమిళిసై సౌందరరాజన్ కూడా ఉదయం 11 గంటలకు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.సాయంత్రం మంత్రుల ప్రమాణ స్వీకారం ఉండబోతోందట.
ఇప్పుడు చేపట్టబోయే మంత్రివర్గ విస్తరణపై చాలామందే ఆశలు పెట్టుకున్నారు.అయితే కేసీఆర్ మాత్రం సామజిక సమీకరణాల ఆధారంగానే మంత్రిపదవులు భర్తీ చేపట్టాలని చూస్తున్నారు.ఇక మొదటి విస్తరణలో చోటు దక్కని కేటీఆర్, హరీశ్రావుకు ఇప్పుడు ఛాన్స్ దక్కబోతోందట.రాజకీయంగా ప్రస్తుతం టీఆర్ఎస్ అనేక విమర్శలు ఎదుర్కుంటోంది.
అయినా ప్రభుత్వంపై వస్తున్న విమర్శలను తిప్పికొట్టే విషయంలో ఇప్పుడున్న మంత్రులు ఎవరూ పెద్దగా స్పందించడంలేదు.దీంతో పార్టీకి మంచి మైలేజ్ తీసుకొచ్చేందుకు హరీశ్, కేటీఆర్లను మంత్రివర్గంలోకి తీసుకోబోతున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది.
అలాగే ఇద్దరు మహిళా మంత్రులను క్యాబినెట్ లోకి తీసుకుంటామని గతంలో కేసీఆర్ ప్రకటించిన నేపథ్యంలో సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్ లేదా హరిప్రియా నాయక్ల పేర్లు ఇప్పుడు పరిశీలనలోకి వచ్చినట్టు తెలుస్తోంది.ఖమ్మం జిల్లాకు ఇప్పటి వరకు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేకపోవడంతో తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యే పువ్వాడ అజయ్లలో ఒకరికి అవకాశం దక్కనున్నట్లు తెలుస్తోంది.
ఒకవేళ వీరిద్దర్నీ కేబినెట్లోకి తీసుకోకపోతే అదే జిల్లాకు సీనియర్ ఎమ్మెల్యే సండ్ర వీరయ్యకు అవకాశం దక్కుతుందట.
ఇక ప్రస్తుతం క్యాబినెట్ లో మంత్రులుగా ఉన్న వారిలో ఇద్దరు లేదా ముగ్గురిని తప్పించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.ఇటీవలి కాలంలో అసంతృప్తి స్వరం వినిపించిన ఈటల రాజేందర్ ను, మల్లారెడ్డి, ఇంద్రకణ్ రెడ్డిలు కూడా పదవులు కోల్పోయే వారి జాబితాలో ఉన్నారట.అదే జరిగితే వారి స్థానంలో జోగు రామన్న, గంగుల కమలాకర్, పల్లా రాజేశ్వర్రెడ్డి, గుత్తా సుఖేందర్రెడ్డికి ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉన్నట్టు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.
ఇప్పటికే సీనియర్ ఎమ్మెల్యేలుగా ఉన్న దాస్యం వినయ్ భాస్కర్ ను చీప్ విప్గా నియమిస్తే.గొంగిడి సునీత, గంపా గోవర్దన్, గువ్వల బాలరాజు, అరెకపూడి గాంధీ, రేగా కాంతారావు, బాల్క సుమన్ లను విప్లుగా నియమించారు.
ఈ మంత్రివర్గ విస్తరణలోనూ తన మార్క్ చూపించి పార్టీని ఇక నుంచి పరుగులు పెట్టించాలని కేసీఆర్ చూస్తున్నాడు.