తెలంగాణ సీఎం కేసీఆర్ లో ఎప్పుడు కనిపించని, ఊహించని మార్పు కనిపిస్తోంది.ఎప్పుడు ఏ విషయంలో అయినా, తనదే పైచేయిగా ఉండాలి తప్ప, ఎవరు ఏం చెప్పినా పట్టించుకోను అన్నట్లుగానే వ్యవహరిస్తూ, రాజకీయంగా తనకు ఎదురు లేకుండా ముందుకు వెళ్లడం కేసీఆర్ స్టైల్.
కానీ ప్రస్తుతం చూస్తున్న కెసిఆర్ మాత్రం సరి కొత్తగా కనిపిస్తున్నారు.అన్ని విషయాలలోనూ సానుకూలంగా ఉండటమే కాకుండా, ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా, తాను వెంటనే రంగంలోకి దిగుతానని, అందరి సమస్యలను పరిష్కరించడానికి తాను సీఎం కుర్చీలో కూర్చున్నాను అనే సంకేతాలను ఇస్తున్నారు.
అడిగినా, అడగకపోయినా అన్ని వర్గాల ప్రజలకు, ఉద్యోగులకు వరాలు ప్రకటిస్తున్నారు.గతంలో చూసిన కెసిఆర్ వేరు, ఇప్పుడు చూస్తున్న కేసీఆర్ వేరు అన్నట్లుగా ఆయన వ్యవహరిస్తున్నారు.
దీనికి కారణం ఇటీవల కాలంలో వరుసగా ఏదైనా ఎదురుదెబ్బ లతోపాటు, బిజెపి వేగంగా బలం పెంచుకోవడం, బలమైన రాజకీయ పార్టీగా తయారవుతుందని, రాబోయే రోజుల్లో అధికారం చేపట్టే అంత స్థాయికి వెళ్తుంది అని కేసీఆర్ నమ్ముతున్నారు.
అలాగే కేంద్ర ,రాష్ట్ర బిజెపి నాయకులు అంతా ఏకాభిప్రాయంతో ఉంటూ టిఆర్ఎస్ హవాను తగ్గించే ఉద్దేశం లో ఉండడం వంటి కారణాలతో అన్ని వర్గాల ప్రజల్లోనూ పట్టుసాధించేందుకు కెసిఆర్ నడుంబిగించినట్టుగా కనిపిస్తున్నారు.
ఇటీవల ఎన్నికలలో వచ్చిన ప్రతికూల అంశాలకు కారణాలను ఇప్పటికే విశ్లేషించే పనిలో కేసీఆర్ ఉన్నారు.అలాగే యువత, ఉద్యోగస్తులలోనూ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉంది అనే విషయాన్ని కేసీఆర్ గుర్తించారు.
అందుకే వారిని ప్రసన్నం చేసుకునేందుకు ఇప్పటికే పెద్దఎతన ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేసే పనిలో ఉన్నారు.ఇక ఉద్యోగస్తులను ప్రసన్నం చేసుకునేందుకు ఇప్పటికే వారికి వేతనాలు పెంచాలని నిర్ణయించుకున్నారు.
అంతకు ముందు మాత్రం కరోనా సమయంలో ఎటువంటి వేతనాలు పెంచమని, పీఆర్సీ ఇచ్చేది లేదు అంటూ ప్రకటించారు.
కానీ ఇప్పుడు ఆ నిర్ణయాన్ని మార్చుకుని పీఆర్సీ ఇస్తుండడం తో పాటు, ఉద్యోగస్తుల రిటైర్మెంట్ వయసును పెంచారు.అలాగే ఆర్టీసీ కార్మికులు గతంలో నెలల పాటు ఉద్యమం కొనసాగించినా, ఆ ఉద్యమాన్ని కఠినంగా అణిచి వేశారు.కానీ ఇప్పుడు ఆర్టీసీ కార్మికులకు వరాలు ప్రకటిస్తున్నారు.
ఆర్టీసీ కార్మికులకు వేతనాలు పెంచాలని, ఆ భారం ఆర్టీసీ పై పడకుండా మొత్తం ప్రభుత్వమే భరించేలా నిర్ణయించుకున్నారు.ఇక ప్రజలకు అనేక సరికొత్త సంక్షేమ పథకాలను అమలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇవన్నీ రాబోయే నాగార్జునసాగర్ ఉప ఎన్నికలు తో పాటు, 2022 ఎన్నికలు వచ్చే అవకాశం ఉందనే ప్రచారం ఊపందుకుంటున్న తరుణంలోనే కేసీఆర్ లో ఈ మార్పు కనిపిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ఏది ఏమైనా కేసీఆర్ లో ఊహించని ఈ మార్పు మాత్రం అన్ని వర్గాల ప్రజలకు మేలు చేసే విధంగా కనిపిస్తోంది.
బిజెపి దూకుడును కాస్తో కూస్తో ఎదుర్కొనేందుకు కేసీఆర్ వరాల జల్లు లు ప్రకటిస్తున్నారు.వాటిని ఓట్ల రూపంలో మార్చుకునే విషయంలో టిఆర్ఎస్ శ్రేణులు ఎంతవరకు సక్సెస్ అవుతాయో చూడాలి.