తెలంగాణాలో రెండోసారి అధికారంలోకి వచ్చిన తరువాత టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.తెలంగాణాలో తాము చెప్పిందే వేదం అన్నట్టుగా ఉండే పార్టీ నాయకులు అసమ్మతి స్వరం వినిపిస్తుండడంతో పాటు నా అనుకున్న వారు కూడా తనకు వ్యతిరేకంగా మారిపోవడాన్నికేసీఆర్ జీర్ణించుకోలేకపోతున్నారు.
ఇక ఇదే సమయంలో ప్రజల నుంచి కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు మూటగట్టుకుంటున్నారు కేసీఆర్.ముఖ్యంగా రెండోసారి అధికారంలోకి వచ్చిన తరువాత లోక్ సభ ఎన్నికల్లో సారూ కారు పదహారు అనే నినాదంతో ఎన్నికలకు వెళ్లినా పదహారు సీట్లలో సగానికి మాత్రమే గెలుచుకోవడంతో పాటు తమ రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్న బీజేపీకి నాలుగు సీట్లు రావడం, కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా పదవి పొందడం కేసీఆర్ జీర్ణించుకోలేకపోతున్నారు.
రాజకీయ వ్యవహార ఇలా ఉండగానే తెలంగాణ ఆర్టీసీ కార్మికులు తమ డిమాండ్లు నెరవేర్చాలంటూ సమ్మె నోటీసు ఇవ్వడం, ఆ తరువాత అది తీవ్ర ఉద్రిక్తతలకు దారితీయడంతో కేసీఆర్ డిఫెన్స్ లో పడిపోయాడు.కార్మిక వ్యతిరేకి కేసీఆర్ అన్నట్టుగా తన మీద ముద్ర వేయించుకోవాల్సి వచ్చింది.దీంతో అందరి దృష్టిలోనూ విలన్ గా మారిపోయాడు కేసీఆర్.అయితే ఎట్టకేలకు ఆర్టీసీ సమ్మె విషయం ఒక కొలిక్కి రావడం, ఆ గొడవలో కేసీఆర్ పై చేయి సాధించడం ఊరటనిచ్చే అంశమే.
ఇప్పటివరకు తెలంగాణాలో శాంతి భద్రతలు బాగానే ఉన్నాయి .కానీ ఈ మధ్య వరసగా జరుగుతున్న ఘటనలు పెరిగిన క్రైం రేట్ తో భాగ్యనగరంలో హత్యలు, అత్యాచారాలు పెరిగిపోయాయి.తాజాగా వెటర్నరీ డాక్టర్ ప్రియాంకారెడ్డిపై అత్యాచారం, హత్య చేసి తగులబెట్టడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.ఏడెనిదేళ్ళ క్రితం దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన నిర్భయ అత్యాచారం కేసు తరువాత అంత స్థాయిలో ప్రియాంకారెడ్డి కేసు హైలెట్ అయ్యింది.
హైదరాబాద్ సురక్షితం కాదని సెలిబ్రిటీల నుంచి అంతా అంటున్నారంటే బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసిందనే చెప్పాలి.
కేసీఆర్ ఇప్పుడు ఈ విషయంలో బాగా బాధపడుతున్నాడు.అసలు టీఆర్ఎస్ మొదటిసారి అధికారంలోకి వచ్చిన తరువాత మహిళా మంత్రే లేకుండా పరిపాలన సాగించారు.అప్పట్లో దీనిపై విమర్శలు రావడంతో కొత్తగా కొందరిని తీసుకున్నారు.
ఇక మహిళా కమిషన్ కేసీయార్ అసలు నియమించలేదు.పక్కనున్న ఏపీలో మహిళా కమిషన్ పనిచేస్తూంటే తెలంగాణాలో లేకపోవడంపై ఇప్పుడు విమర్శలు పెరిగిపోతున్నాయి.
ఇది ఇలా ఉండగానే తమ రాజకీయ ప్రత్యర్థి బీజేపీ తెలంగాణకు మహిళా గవర్నర్ గా తమిల్ సై ని పంపించడం పుండు మీద కారం చల్లినట్టుగా ఉంది.ఇక ఇప్పుడు ఈ వ్యహారాలన్నీ తమకు ప్రతికూలంగా మారడం కేసీఆర్ ను ఇబ్బందుల్లోకి నెడుతోంది.