తెలంగాణ సీఎం కేసీఆర్ కీలక నిర్ణయాలు తీసుకుంటూ టిఆర్ఎస్ ను జనాల్లోకి తీసుకువెళ్ళే విషయంపై దృష్టి సారించారు.రానున్న రోజుల్లో టీఆర్ఎస్ కు గట్టి పోటీ ఇచ్చి బిజేపీ ముందుకు వెళ్తున్న తీరు కేసీఆర్ లో కలవరం పుట్టిస్తోంది.
అందుకే కేసిఆర్ రాబోయే సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని టీ ఆర్ ఎస్ ని పరుగులు పెట్టించేందుకు కేసీఆర్ సిద్ధమయ్యారు.దీని కోసమే అనేక నిర్ణయాలు తీసుకుంటున్నారు.
తాజాగా బియ్యం కొనుగోళ్ళ విషయంలో కేంద్రం తో పేచీ పడుతున్నారు.తెలంగాణలో రైతులు పడుతున్న ఇబ్బందులకు కారణం కేంద్రం అని, ఇందులో టిఆర్ఎస్ తప్పేమీ లేదని, ఈ విషయాన్ని ప్రజలు ముందు కు తీసుకువెళ్లేందుకు కేసీఆర్ అనేక విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు .దీనిలో భాగంగానే రాబోయే పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో కేంద్రం విధానాన్ని నిలదీసి ఒత్తిడి పెంచాలని నిర్ణయించుకున్నారు.
దీనిలో భాగంగానే ఈరోజు ప్రగతి భవన్ లో టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం ను కేసీఆర్ నిర్వహిస్తున్నారు.
ఈ సందర్భంగా పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో టిఆర్ఎస్ పార్టీ ఏ విధంగా వ్యవహరించాలనే వ్యూహంపై ఎంపీలకు కేసీఆర్ అనేక సూచనలు చేయబోతున్నారు. సభలో ఏ అంశాలపై చర్చించాలి, ఏ విషయంలో కేంద్రం తీరును నిలదీయాలి ఏ విషయంలో ఏ విధంగా వ్యవహరించాలి అనే విషయం లో కేసీఆర్ క్లారిటీ ఇవ్వబోతున్నారు.
దీంతో ఈ సమావేశానికి తప్పనిసరిగా లోక్ సభ, రాజ్యసభ సభ్యులంతా హాజరుకావాలని టిఆర్ఎస్ కార్యాలయం నుంచి అందరికీ సమాచారం వెళ్ళింది.
అలాగే వానా కాలంలో వరి కొనుగోళ్ల అంశంతో పాటు, యాసంగి లో ఎఫ్ సీ ఐ ద్వారా బియ్యం సేకరణ కు సంబంధించిన అంశాలను టీఆర్ఎస్ ఎంపీల ద్వారా గట్టిగా నిలదీసే అవకాశం కనిపిస్తోంది.వీటితో పాటు విభజన చట్టం, పెండింగ్ లో ఉన్న నిధులు, కేంద్రం ఇచ్చిన అనేక హామీలు అమలు కాకుండా ఉండడం, జల వివాదాలు, కేంద్రం నుంచి చట్టబద్ధంగా తెలంగాణకు రావాల్సిన నిధుల విడుదల లో జరుగుతున్న జాప్యం తదితర అన్ని అంశాలను టిఆర్ఎస్ ఎంపీల ద్వారా నిలదీసి కేంద్రాన్ని ఇరుకున పెట్టాలని కేసీఆర్ చూస్తున్నారు.దీనిలో భాగంగానే ఎంపీలకు దిశానిర్దేశం చేయబోతున్నారు.