ఆకస్మాత్తుగా తెలంగాణ సీఎం, టిఆర్ఎస్ అధినేత కెసిఆర్ అనారోగ్యానికి గురయ్యారు.ఊపిరితిత్తుల్లో మంటగా ఉండడంతో, ఆయన యశోద ఆసుపత్రిలో చేరినట్లుగా టీఆర్ఎస్ కీలక నాయకులు పేర్కొంటున్నారు.
ఇప్పటికే ఆయనకు వైద్య పరీక్షలు పూర్తి అయినట్లు తెలుస్తోంది.ఉదయం నుంచి కెసిఆర్ అనేక కార్యక్రమాల్లోనూ పాల్గొంటూ వస్తున్నారు.
ముఖ్యంగా తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ కోహ్లీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఈ రోజు ఉదయం కేసీఆర్ హాజరయ్యారు.సోమాజిగూడలోని రాజ్ భవన్ లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
గవర్నర్ డాక్టర్ తమిళసై సౌందరరాజన్ హిమ కోహ్లీ తో ప్రమాణ స్వీకారం చేయించారు.ఈ కార్యక్రమం ముగిసిన కొద్ది సేపటికే కెసిఆర్ విశ్రాంతి తీసుకున్నారని, అనంతరం ఊపిరితిత్తులు, ఛాతిలో మంటగా ఉండటంతో యశోద ఆస్పత్రిలో ఆయన చేరినట్లు తెలుస్తోంది.
ఇక యశోద ఆసుపత్రి డాక్టర్లు ఫిజీషియన్ డాక్టర్ ఎంవీ రావు, పల్మనాలజిస్ట్ డాక్టర్ నవనీత్ సాగర్ , కార్డియాలజిస్ట్ డాక్టర్ ప్రమోద్ కుమార్ ఆయనకు ప్రాథమిక వైద్య పరీక్షలు నిర్వహించి అనంతరం ఎం ఆర్ ఐ , సిటీ స్కాన్ లను చేశారు.ప్రస్తుతం కెసిఆర్ ఆరోగ్యం నిలకడగానే ఉందని తెలుస్తోంది.అయితే చాలా కాలంగా ఆరోగ్యపరంగా కేసీఆర్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.ఇటీవల కేంద్రమంత్రి గడ్కరి పాల్గొన్న ఒక కార్యక్రమంలో ఆయన ఆన్లైన్ ద్వారానే పాల్గొన్నారు.ఇక ఎక్కువగా ఫార్మ్ హౌస్ కే పరిమితం అయిపోవడం పై రాజకీయ విమర్శలు వస్తున్న తరుణంలో కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చి యాక్టీవ్ గా రాజకీయాల్లో పాల్గొంటున్నారు.అయితే కెసిఆర్ ఆరోగ్యానికి ఎటువంటి ఇబ్బందులు లేవని, కేవలం కేటీఆర్ ను సీఎంగా ప్రకటించేందుకు అనారోగ్య కారణాలు చూపిస్తున్నారనే విమర్శలు ఇప్పుడు పెద్ద ఎత్తున మొదలయ్యాయి.
ఏది ఏమైనా కేసీఆర్ ఆరోగ్యంపై టీఆర్ఎస్ శ్రేణులు కాస్త కంగారు పడుతూ కేసీఆర్ ఆరోగ్య వివరాలపై ఆరాతీస్తున్నాయి.