తెలంగాణ సీఎం కేసీఆర్ కు ఇప్పుడు ఎక్కడలేని భయం పట్టుకున్నట్టుగా కనిపిస్తోంది.పార్టీలో చేరిన అసమ్మతి తో ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడడంతో ఏమి చేయాలో తెలియని పరిస్థితుల్లో కేసీఆర్ డైలమాలో పడ్డాడు.
ఏ క్షణాన ఏ నాయకుడు పార్టీ వీడుతాడో తెలియని పరిస్థితి టీఆర్ఎస్ లో నెలకొంది.అందుకే పార్టీలో ఉన్న కీలక నాయకులతో పాటు టీఆర్ఎస్ ఎమ్యెల్యేలు, ద్వితీయ శ్రేణి నాయకులపై కేసీఆర్ నిఘా ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది.
ఒక వైపు పార్టీలో అసంతృప్తి, మరోవైపు బీజేపీ భయంతో కేసీఆర్ సొంత నాయకులపై ఇలా నిఘా ఏర్పాటు చేయడం చర్చనీయాంశయంగా మారింది.అయితే ఒకరి తరువాత ఒకరు పార్టీపై తమ వ్యతిరేకతను చూపిస్తూనే ఉన్నారు.
కొంతమంది నాయకులు మాత్రం పార్టీ నుంచి అక్షింతలు గట్టిగా పడడంతో తాము అలా అనలేదని, మీడియా తప్పుగా అర్ధం చేసుకుంది అంటూ కప్పిపుచ్చే ధోరణి అవలంబిస్తున్నారు.అయితే అప్పటికే పార్టీకి జరగాల్సిన నష్టం జరిగిపోతోంది.
ఏ క్రమంలో పార్టీ నేతలకు అధిష్టానం నుంచి గట్టిగానే సూచనలు అందాయట.
ముఖ్యంగా ఈ విషయంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసాడట.పార్టీ అనుమతి లేకుండా ఎవరూ ఎటువంటి పత్రిక సమావేశాలు నిర్వహించరాదని, అలాగే ఎక్కడా పార్టీ పరంగా ఏమి మాట్లాడటానికి వీల్లేదని, అలాగే అసెంబ్లీ లాబీలో గతంలో మాట్లాడినట్టుగా మీడియాతో చిట్ చాట్ పెట్టటానికి లేదని, అసెంబ్లీ మీడియా పాయింట్ లో కూడా సాధ్యమైనంత వరకు మీడియాకి దూరంగా ఉండాలంటూ కేటీఆర్ స్పష్టమైన సూచనలు చేసినట్టు పార్టీలో చర్చ నడుస్తోంది.దీనిపై పార్టీ నాయకుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
గతంలోనే మీడియా డిబేట్లకు హాజరుకావద్దంటూ ఆదేశాలు ఇచ్చారని, ఇప్పుడు ఈ విధంగా నిబంధనలు పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అంటూ ప్రశ్నిస్తున్నారు.
ఎంతకాలం అని ఈ రకంగా ఎమ్మెల్యేలను భయపెట్టి ఎన్ని రోజులు అని పార్టీలో ఉన్న అసమ్మతి బయటకు రాకుండా చేయగలరనే ప్రశ్న అందరిలోనూ తలెత్తుతోంది.ముందు పార్టీ పరంగా చేయాలవసిన పనులు చేయటం, పార్టీలో ఏక వ్యక్తి నిర్ణయాధికారాన్ని పక్కన పెట్టటం.మంత్రులకి , సీనియర్ నేతలకి, ఎమ్మెల్యేలకి అధినేత కేసీఆర్ మధ్య ఎటువంటి బేధాభిప్రాయాలు లేకుండా చూసుకుంటే బాగుంటుందని మరికొంతమంది సూచనలు చేస్తున్నారు.
అదే విధంగా మొదటి నుంచి పార్టీని నమ్ముకుని ఉన్నవారిని పక్కనపెట్టి ఈ మధ్యకాలంలో పార్టీలో చేరిన వారికి ప్రభుత్వంలో కీలక పదవులు ఇవ్వడమే కాకుండా తమకు ప్రాధాన్యం తగ్గించడం ఎంతవరకు కరెక్ట్ అంటూ కొంతమంది నాయకులు ప్రశ్నిస్తున్నారు.