పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ చోటుచేసుకుంటున్న కొన్ని కొన్ని వ్యవహారాలు తెలంగాణ సీఎం కేసీఆర్ కు తీవ్ర ఆగ్రహాన్ని కలిగిస్తున్నాయి.బలమైన పార్టీగా తెలంగాణలో టిఆర్ఎస్ పునాదులు వేసుకున్నా, కొంతమంది నాయకుల వ్యవహార శైలి కారణంగా ఆ క్రెడిట్ మొత్తం పోతుందని, గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వానికి ఉన్న క్రేజ్ అమాంతం తగ్గిపోయిందని, ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంద ని, బలహీనంగా ఉన్న రాజకీయ ప్రత్యర్థులు ఇప్పుడు బలమైన పునాదులు వేసుకుంటున్నారు అని, ఇదంతా స్వీయ తప్పిదాల కారణంగానే జరుగుతోందని అభిప్రాయంతో ఉన్న కేసీఆర్ పూర్తిగా ప్రక్షాళన చేయకపోతే గ్రేటర్ ఎన్నికల తో పాటు, ఆ తరువాత జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లోనూ ఆ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుందనే ఆందోళనలో ఉన్నట్లుగా తెలుస్తోంది.
అందుకే పూర్తిగా ప్రక్షాళన దిశగా అడుగులు వేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం ముందుగా క్యాబినెట్ మంత్రులు వ్యవహారశైలిపై చాలాకాలంగా కేసీఆర్ అసంతృప్తిగా ఉన్నారు.కొంత మంది అవినీతి వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటూ, ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకొస్తున్నారు.
గ్రేటర్ పరిధిలో సంభవించిన వరదల కారణంగా నష్టపోయిన వారికి పరిహారం అందించే విషయంలో చాలా చోట్ల అవినీతి చోటు చేసుకోవడం, ప్రతిపక్షాలు ప్రభుత్వంపై విమర్శలు చేయడం వంటి వ్యవహారాలు సీరియస్ గానే భావిస్తున్నారు.దీనికి తోడు దుబ్బాక ఉప ఎన్నికల్లో ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారు.
అందుకే క్యాబినెట్ లో పని తీరు సక్రమంగా లేని వారిని ఇంటికి పంపించి, కొత్తవారితో వాటిని భర్తీ చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.వచ్చే ఏడాది జనవరిలో కానీ , ఫిబ్రవరి మొదటి వారంలో గాని జిహెచ్ఎంసి ఎన్నికలు జరిగే అవకాశం ఉండటంతో, ప్రస్తుతం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ఉండడం, వీటన్నిటిని లెక్కలు వేసుకుంటున్నారు కేసీఆర్.
ఎన్నికలకు ముందుగానే క్యాబినెట్ ప్రక్షాళన చేయాలా, లేక ఆ తర్వాత ప్రక్షాళన చేయాలనే విషయంపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.ఇప్పటికే ఇంటెలిజెన్స్ ద్వారా మంత్రుల పనితీరు ఎలా ఉంది అనే విషయాన్ని తెలుసుకున్న కెసిఆర్ ఆ రిపోర్ట్ లో సరైన పనితీరు చూపించలేని మంత్రులను తప్పించి, ఆ స్థానం చురుకైన వారిని నియమించాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.పనిలో పనిగా ఇటీవల నిజామాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచిన కవిత కు మంత్రి పదవి ఇచ్చే విషయంపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.అసలు చాలాకాలంగా కవితకు మంత్రి పదవి ఇచ్చే విషయంలో కెసిఆర్ క్యాబినెట్ ప్రక్షాళన చేయాలని చూస్తున్నారు.
ఇప్పుడు ఈ వ్యవహారాలు కూడా కలిసి రావడంతో పూర్తిగా మొహమాటాలు పక్కనపెట్టి పార్టీకి, ప్రభుత్వానికి ఉపయోగపడే వారినే మంత్రివర్గంలో ఉంచాలని, మిగతా వారిని తప్పించాలని చూస్తున్నట్లు సమాచారం.
ఇప్పటికే గ్రేటర్ ఎన్నికల తో పాటు, ఎమ్మెల్సీ ఎన్నికల బాధ్యతలను కొంతమంది మంత్రులకు అప్పగించారు.
అయితే ఆ ఎన్నికలలో గెలుపోటములను బట్టి మంత్రి వర్గ ప్రక్షాళన చేస్తారని టిఆర్ఎస్ లో కొంతమంది నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు.అంతకుముందే ఈ ప్రక్షాళన కార్యక్రమం మొదలవుతుందని మరికొంతమంది టీఆర్ఎస్ కీలక నాయకులు వ్యాఖ్యానిస్తూ ఉండడంతో, కేసీఆర్ నిర్ణయం విధంగా ఉండబోతోంది అనేది తెలియక మంత్రులకు టెన్షన్ పట్టుకుందట.