మొన్నటి వరకు ఒక లెక్క ఇప్పుడు ఒక లెక్క అన్నట్లుగా తయారైంది తెలంగాణలో రాజకీయ నాయకుల పరిస్థితి.టిఆర్ఎస్ కు బలమైన ప్రత్యర్థిగా బిజెపిని ముందుకు తీసుకెళ్లడంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సక్సెస్ అవుతూ వచ్చారు.
పేరుకే తప్ప కాంగ్రెస్ ప్రభావం ఏమీ ఉండదు అనే అంచనాలో ఉంటూ వచ్చారు. టిఆర్ఎస్ కు రాజకీయ ప్రత్యామ్నాయం బీజేపీనే అన్నంత స్థాయికి ఆ పార్టీ ఎదగగలిగింది.
అయితే ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు. తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి నియామకం అయిన దగ్గర నుంచి బిజెపి ప్రభావం తగ్గుతూ వస్తున్నట్లు కనిపిస్తోంది.
బిజెపి తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ మొదట్లో ఉన్నంత యాక్టివ్ గా కనిపించడంలేదు.
హుజూరాబాద్ నియోజకవర్గం ఈటల రాజేందర్ పోటీ చేయబోతుండడంతో, టిఆర్ఎస్ కు ముచ్చెమటలు పట్టించే స్థాయిలో రాజేందర్ ఉన్నా, అక్కడ బిజెపీ పేరు పెద్దగా వినిపించడం లేదు.
కేవలం రాజేందర్ వర్సెస్ టీఆర్ఎస్ అన్నట్టుగా పరిస్థితి ఉంది.హుజురాబాద్ లో బిజెపి అగ్రనేతలు రాష్ట్ర నేతలు ప్రచారం చేసినా, చేయకపోయినా ఈటెల రాజేందర్ ఒక్కడి బలం సరిపోతుందనే లెక్క ఉంది.
ఇదిలా ఉంటే ఈ మధ్యకాలంలో బీజేపీకి ఒక్కో నేత రాజీనామా చేసి ఇతర పార్టీలో చేరిపోతూ ఉండడం ఆ పార్టీ నాయకుల్లో ఆందోళన కలిగిస్తోంది.తాజాగా బీజేపీ లో యాక్టిివ్ గా ఉన్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి ఇప్పుడు బిజెపికి రాజీనామా చేశారు.
గతంలో ఆయన చాలాసార్లు హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి గెలిచిన అనుభవం ఉంది.ఈటెల రాజేందర్ ను చేర్చుకునే సమయంలో కనీసం తనను సంప్రదించలేదనే ఆగ్రహంతో పెద్దిరెడ్డి ఉన్నారు.ఈ విషయంపై చాలా రోజులుగా అసంతృప్తితోనే ఉన్నా, తాజాగా ఆయన పార్టీకి రాజీనామా చేశారు.ఇక కాంగ్రెస్ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి నియామకం అయిన తర్వాత మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షుడు ఎర్ర శేఖర్ బీజేపీ కి రాజీనామా చేశారు.
ఇక నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ సోదరుడు సంజయ్ కాంగ్రెస్ లో చేరారు.కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ బిజెపి నుంచి కాంగ్రెస్ లోకి వెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్నారు.
తెలంగాణ బీజేపీ లో ఇంత రాజకీయం నడుస్తున్నా, ఆ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ సైలెంట్ గా ఉండి పోతున్నారు.అసంతృప్తులను ఆయన బుజ్జగించేందుకు పెద్దగా ప్రయత్నించడం లేదు అన్నట్టుగా పరిస్థితి ఉంది.దీంతో ఇతర పార్టీల నుంచి బిజెపిలో చేరిన ఒక్కో నేతా ఇప్పుడు బిజేపి కి గుడ్ బాయ్ చెప్పి బయటకి వచ్చే పరిస్థితి నెలకొంది.
.