తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కు పునర్వైభవం తీసుకు వచ్చేందుకు ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు.ఆ పార్టీ నాయకులు కలిసివచ్చినా, రాకపోయినా పార్టీ కి ఏదో రకంగా ఊపు తీసుకువచ్చి 2023 ఎన్నికల్లో విజయం సాధించాలనే పట్టుదలతో ఉన్నారు.
కానీ రేవంత్ కు అడుగడుగునా సొంత పార్టీ నాయకులే అడ్డుతగులుతూ, ఆయన హవా పెరగకుండా నిత్యం ప్రయత్నిస్తున్నారు.రేవంత్ ఏ కార్యక్రమం తలపెట్టినా, సీనియర్ నాయకులు ఎవరు పెద్దగా సహకరించక పోగా, అడ్డుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు.
దీని కారణంగా తెలంగాణలో కాంగ్రెస్ బలపడకపోగా, మరింత బలహీనం అవుతూ వస్తోంది.
ఇదిలా ఉంటే, సరిగ్గా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో ఏ విధమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడో, ఇప్పుడు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సైతం అదే రకమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
పార్టీకి మేలు జరిగే విధంగా వచ్చే ఎన్నికల నాటికి అధికారం దక్కించుకునే విధంగా, బండి సంజయ్ వినూత్నమైన కార్యక్రమాలు రూపొందిస్తూ, పార్టీని పరుగులు తీస్తూ వస్తున్నారు.క్షేత్రస్థాయిలో ప్రజా పోరాటాలు, ఉద్యమాలు చేపడుతూ జనాల్లోకి బీజేపీ వెళ్ళేలా చర్యలు తీసుకుంటున్నారు.
కానీ ఇవేమీ పట్టినట్టు మిగతా నాయకులు వ్యవహరిస్తున్నారు.
ఈ పరిణామాలతో బండి సంజయ్ అసహనం గా ఉన్నారట.కేవలం ఒకరిద్దరు నాయకులు మాత్రమే యాక్టివ్ గా ఉంటూ టిఆర్ఎస్ ప్రభుత్వం పై దూకుడుగా వ్యవహరిస్తున్నారని, కానీ మిగతా నాయకులంతా ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా వ్యవహరిస్తుండడం వంటివి పెద్ద ఇబ్బందికరంగా మారింది.టిఆర్ఎస్ ను ఎదుర్కొనే క్రమంలో మరో ఎంపీ ధర్మపురి అరవింద్ గట్టిగానే మాట్లాడుతున్నాడు.
అలాగే ఎమ్మెల్యే రాజాసింగ్ సైతం ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు.
కానీ మిగతా నాయకులు ఎవరు పట్టించుకోనట్టుగా వ్యవహరిస్తుండడంతో, ఈ విషయాలపై అధిష్టానానికి ఫిర్యాదు చేయాలనే ఆలోచనలో కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
నాయకుల వ్యవహార శైలి ఈ విధంగా ఉంటే, 2023లో అధికారం దక్కించుకోవడం అసాధ్యం అనేది సంజయ్ అభిప్రాయం.ఈ మేరకు సమగ్రమైన నివేదికను కూడా అధిష్టానం పెద్దలకు సమర్పించబోతున్నట్లు తెలుస్తోంది.